ప్రమాదంలో విద్యార్థుల మృతి:జేఎన్టీయూ విజయనగరం క్యాంపస్ లో కలకలం
విజయనగరం: విజయనగరంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి, మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయాల పాలైన ఘటన జేఎన్టీయూ విజయనగరం క్యాంపస్ ను వివాదం వివాదంలోకి నెట్టింది.
రాత్రి సమయంలో జరిగిన ఈ యాక్సిడెంట్ లో ప్రమాదానికి గురైన విద్యార్థులు ఈ క్యాంపస్ హాస్టల్ విద్యార్థులు కాగా వారు అనుమతి లేకుండా బైటకు వెళ్లడమే వివాదానికి కారణం. దీంతో క్యాంపస్ హాస్టల్ నుంచి విద్యార్థులు రాత్రి సమయాల్లో బయటకు వెళ్తున్నట్లు ఈ రోడ్డు ప్రమాదం ద్వారా బైటపడింది. దీంతో ఇక్కడ విద్యార్థుల మీద కనీస పర్యవేక్షణ కూడా కరువైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే...
విజయనగరంలో జెఎన్టియు క్యాంపస్ లో ఐటీ బ్రాంచి ఫోర్త్ ఇయర్ విద్యార్థి పి.సాయివికాస్ శుక్రవారం రాత్రి జరిగిన బైక్ యాక్సిడెంట్ లో మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో అదే విద్యార్థితో పాటు బైక్ పై వెళ్లిన ఇంకో ఇద్దరు విద్యార్థులు కె.శ్రీనివాస సాయి (సివిల్ బ్రాంచ్, ఫైనల్ ఇయర్), టి.హర్షవర్ధన (బీటెక్, థర్డ్ ఇయర్) వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వీరు ప్రస్తుతం మహారాజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా రాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై తాటిపూడి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తాటిపూడి సమీపంలో ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.
అయితే క్యాంపస్ లో ఉండాల్సిన వీరు అనుమతి లేకుండా బైటకు ఎలా వెళ్లారనే విషయమై వివాదం రేగింది. నిబంధనల ప్రకారం విద్యార్థులు రాత్రి 9 గంటల తరువాత బయటకు వెళ్లేందుకు అనుమతి లేదు. అయితే ఈ విషయమై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఫుడ్ తినేందుకు దాబాకు వెళ్తున్నట్లు సెక్యూరిటీ వద్ద నమోదు చేసుకున్నారని కొందరు విద్యార్ధులు చెబుతుండగా, నమోదు చేసుకోకుండా సెక్యూరిటీ ప్రశ్నించినా లెక్కచేయకుండా బైక్ పై వెళ్లిపోయారని యూనివర్శిటీ అధికారులు పేర్కొంటున్నారు.
అయితే ఆహారం కోసం రాత్రి వేళ అక్కడకు వెళ్లే అవసరం ఏమిటనే దానిపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. కొందరు విద్యార్థులేమో భోజనం బాగోక కొందరు విద్యార్థులు ఇలా బైటకు వెళ్లి తిని వస్తుంటారని అంటుండగా...విద్యార్థులు మద్యం తాగడం కోసమే వెళ్ళారని మరోవైపు ప్రచారం జరుగుతోంది. ప్రమాద ఘటన కూడా మద్యం మత్తులోనే జరిగిందని చెప్పుకొంటున్నారు.
ఏదేమైనా ఈ క్యాంపస్ వసతిగృహంలో సరైన పర్యవేక్షణ లేకపోవడం కూడా ఈ ప్రమాదం జరగడానికి ఒక కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే హాస్టల్ ఓహెచ్ (ఆఫీసర్ ఆఫ్ హాస్టల్) 15 రోజులుగా సెలవులో ఉన్నట్లు జేఎన్టీయూ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ క్రమంలో ఇన్ఛార్జి గా వేరొకరికి బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా అలా అప్పగించనట్లు తెలుస్తోంది. దీంతో గడిచిన కొంత కాలంగా విద్యాలయంలో వసతిగృహాలపై పర్యవేక్షణ గాడి తప్పిందన్న ఆరోపణలు వాస్తవమేనని తేలింది.
ఈ క్యాంపస్ కు సంబంధించి గతంలో కొన్ని వివాదాస్పద ఉదంతాలు చోటుచేసుకున్నాయి. రెండు నెలల కిందట ఈ జేఎన్టీయూ విద్యార్థి డ్రంకన్డ్రైవ్లో దొరకడం, రాత్రి సమయాల్లో అమ్మాయిలతో బయట సంచరిస్తూ మరి కొందరు విద్యార్థులు పోలీసులకు పట్టుబడటం వంటి సందర్భాలున్నాయి. జెఎన్టియూ హెడ్ ఆఫ్ ద డిపార్ట్ మెంట్ వి.రాము ఈ విషయమై మాట్లాడుతూ..."విద్యార్థులు రాత్రి సమయంలో బయటకు వెళ్లడానికి వీలులేదు. తలుపులు తీసి ఉండడంతో సెక్యూరిటీకి చెప్పకుండా వెళ్లారని . ప్రమాదం జరగడంతో ఈ విషయం వారిని అడిగి తెలుసుకున్నాం. తాడిపూడి ఎందుకు వెళ్లారన్నది విచారణ చేస్తున్నాం. వసతిగృహం అధికారి సెలవులో ఉన్నా వేరొకరికి విచారణ బాధ్యతలు అప్పగించాం...ప్రస్తుతం వారు ఆసుపత్రిలో ఉన్నారు. మెస్లో అసౌకర్యాలున్నటు విద్యార్థులు నా దృష్టికి తీసుకు రాలేదు. వస్తే పరిష్కరిస్తాం"...అని చెప్పారు.