టీ బిల్లుపై చర్చ మొదలైంది: సిఎంకు భట్టి కౌంటర్
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై సభలో చర్చ ప్రారంభమైందని, ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 11న జరిగిన శాసనసభా వ్యవహారాల కమిటీ(బిఏసి) నిర్ణయం మేరకే సభలో ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టామని, బిఏసి నిర్ణయానికి అనుగుణంగానే సభలో చర్చ ప్రారంభమైందని ఆయన తెలిపారు.
బిఏసి నిర్ణయంలో ముఖ్యమంత్రి, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు భాగస్వాములేనని చెప్పారు. శాసనసభలో బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకోవడమంటే ప్రజాస్వామ్యానికి అడ్డుతగలడమేనని ఆయన అన్నారు. సభాపతులకు ప్రాంతీయ భావాలు, రాగద్వేషాలకు అతీతంగా వారి విధులు నిర్వహిస్తారని విక్రమార్క తెలిపారు. జనవరి 3 నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో సభ్యులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించాలని భట్టి విక్రమార్క చెప్పారు.
బిల్లు పరిణామాలపై రాష్ట్రపతిని కలుస్తాం: కోదండరాం
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి తెలంగాణ ముసాయిదా బిల్లుపై జరుగుతున్న పరిణామాలను వివరిస్తామని తెలంగాణ రాజకీయ జెఏసి ఛైర్మన్ కోదండరాం అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల తరపున రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పిస్తామని తెలిపారు.
ముసాయిదా బిల్లులో మార్పులు, చేర్పుల అంశాలపై తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల సంతకాలు సేకరిస్తామని చెప్పారు. బిల్లు పరిణామాలపై తెలంగాణ వ్యాప్తంగా సభలు నిర్వహించి ప్రజలకు వివరిస్తామని కోదండరాం తెలిపారు.