టైం కావాలని బయటకు కిరణ్: రేపటి నుండే..దామోదర
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉందని, అందుకే తాము సమయం కోరుతున్నామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం బిఏసి సమావేశంలో అన్నారు. బిఏసి సమావేశం హాట్హాట్గా సాగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ... ముసాయిదా బిల్లు పైన సీమాంధ్ర ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయని, బిల్లు పైన సీమాంధ్ర ప్రజలకు వివరణ ఇవ్వాల్సి ఉందని చెప్పారు.
అసెంబ్లీలో ప్రతి క్లాజు పైన ఓటింగు ఉండాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. కిరణ్ తన అభిప్రాయం చెప్పి బయటకు వచ్చారు. దీనిపై సభాపతి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ... ఇతర రాష్ట్రాలలో విభజన తీరును పరిశీలించి ఓటింగు పైన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ప్రతి క్లాజు పైన ఓటింగు, చర్చ జరిపే తేదీలను, చర్చను పార్టీల వారీగా కేటాయించాలా లేక ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇవ్వాలా అనే అంశాలను బిఎసి స్పీకర్, శాసన సభ వ్యవహారాల మంత్రికి వదిలేసింది.
రేపటి నుండి బిల్లుపై చర్చిస్తాం: దామోదర
బిఎసి సమావేశం అనంతరం ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ... రేపటి నుండి శుక్రవారం వరకు తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చిస్తామన్నారు. చర్చ తర్వాత బిఏసిలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
రేపటి నుండి ప్రశ్నోత్తరాలు రద్దు
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ నేపథ్యంలో రేపటి నుండి ప్రశ్నోత్తరాలు రద్దు చేయనున్నారని సమాచారం. నేరుగా ముసాయిదా బిల్లు పైనే చర్చ జరగనుంది. శుక్రవారం వరకు చర్చ జరిగిన అనంతరం జనవరిలో రెండో విడత సమావేశాలు ప్రారంభమవుతాయి.