శాసన మండలిలో లోకేష్ ఫోన్ వినియోగంపై రభస
Recommended Video
ఏపీ శాసనమండలిలో సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులపై చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చకు అనుమతించారు మండలి స్పీకర్ షరీఫ్ . ఇక వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై మూడు గంటలపాటు చర్చించాలని శాసన మండలి నిర్ణయం తీసుకుంది . దీని కోసం ఒక్కో సభ్యుడికి మూడు నిమిషాల సమయం కేటాయించారు మండలి ఛైర్మన్ షరీఫ్. ప్రస్తుతం మండలిలో సైతం వాడి వేడి చర్చ కొనసాగుతుంది.
మండలి సభ్యులకు సమయం కేటాయించిన స్పీకర్
ఇక పార్టీల వారీగా డిప్యూటీ ఛైర్మన్ టీడీపీకి 84 నిమిషాల సమయంల కేటాయిం చారు . వైసీపీకి 27 నిమిషాలు, పీడీఎఫ్కు 15 నిమిషాలు, బీజేపీకి 6 నిమిషాల సమయం కేటాయిస్తున్నట్టు డిప్యూటీ చైర్మన్ తెలిపారు. దీంతో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై శాసనమండలిలో చర్చ జరుగుతుంది .బిల్లులపై టీడీపీ ఎమ్మెల్సీ లోకేశ్ తమ పార్టీ అభిప్రాయాన్ని వెల్లడించారు. రాజధాని తరలిస్తూ వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు నారా లోకేష్ . గతంలో ఐఏఎస్ ఆఫీసర్ మన్మోహన్ సింగ్ జారీ చేసిన సర్క్యులర్ను లోకేష్ చదివి వినిపించారు.
వైసీపీ సర్కార్ పై లోకేష్ ఫైర్ .. సభలో స్మార్ట్ ఫోన్ వినియోగంపై చర్చ
శాసనమండలిలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. స్మార్ట్ఫోన్ చూస్తూ ఆయన ప్రసంగించారు. నవరత్నాల కోసం చర్చిలు, మసీదుల భూములు విక్రయించేందుకు జీవో ఇచ్చారని లోకేష్ ఆరోపణలు గుప్పించారు . దీంతో ఆయనపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సభలోకి సెల్ఫోన్ తీసుకురావడం సాంప్రదాయాలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో సెల్ ఫోన్ వినియోగం ఏమీ నేరం కాదని అందులో నోట్స్ ఉంటుందని దాన్ని చూసి చదవడంలో తప్పు లేదని చెప్పారు.
లోకేష్ వ్యాఖ్యలపై బుగ్గన ఫైర్
ఇక లోకేష్ వ్యాఖ్యలపై స్పందించిన బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలని లోకేశ్కు సవాలు విసిరారు. లోకేష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. లోకేశ్ చదివి వినిపించిన ఆ జీవో ఎక్కడ ఉందో చూపించాలని డిమాండ్ చేశారు. కనీసం ఆ జీవో నంబర్ అయినా చెప్పాలని అన్నారు. లేదంటే సభకు లోకేష్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తానికి ఏపీ శాసన మండలిలోనూ నేడు సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులపై చర్చ కొనసాగుతుంది.