దక్కన్ క్రానికల్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి అరెస్టు
హైదరాబాద్: ప్రముఖ దినపత్రిక దక్కన్ క్రానికల్ చైర్మన్ వెంకట్రామిరెడ్డిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఫోర్జరీ పత్రాలతో రూ. 600 కోట్ల వరకు రుణాలు పొంది బ్యాంకులను మోసం చేశారన్న ఆరోపణలపై బెంగళూరు సీబీఐ అధికారులు శనివారం వెంకట్రామిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విచారణలో ఫోర్జరీ పత్రాలతో బ్యాంకులను మోసం చేసినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.
రూ. 1230 కోట్ల మేర రుణం తీసుకుని తమను మోసం చేశారని కెనరా బ్యాంక్ చేసిన ఫిర్యాదు మేరకు సిబిఐ అధికారులు కేసు నమోదు చేసి, వెంకట్రామిరెడ్డిని అరెస్టు చేశారు. నకిలీ పత్రాలతో దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ రూపొందిందని, ఈ వ్యవహారంలో తమకు రూ.357.77 కోట్ల మేర నష్టం వాటిల్లిందని బ్యాంక్ ఫిర్యాదు చేసింది. వెంకట్రామిరెడ్డితో పాటు ఆయన సోదరుడు రవి రెడ్డిని కూడా సిబిఐ అధికారులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాదులోని ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన న్యాయమూర్తుల సముదాయానికి తరలించారు. అయితే, ఆయనను ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్పై బెంగళూరు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.బెంగళూరు సిబిఐకి చెందిన బ్యాంకింగ్ సెక్యూరిటీ, ఫ్రాడ్ సెల్ బృందం శనివారం ఉదయం హైదరాబాద్ వచ్చి వెంకటరామిరెడ్డిని ఫ్రాడ్ ఆరోపణలపై కోటిలోని సిబిఐ స్థానిక కేంద్ర కార్యాలయంలో ప్రశ్నించారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆయనను అరెస్టు చేశారు.
దక్కన్ క్రానికల్ యజమాని, ప్రచురణకర్త అయిన టి. వెంకట్రామిరెడ్డి గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు దక్కన్ చార్జర్స్ ప్రమోటర్ కూడా వ్యవహరించారు. ఆయన పలు సివిల్, క్రిమినల్ కేసులను ఎదుర్కుంటున్నారు.