దక్కన్ క్రానికల్ చైర్మన్ వెంకట్రామిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సిబిఐ
హైదరాబాద్: దక్కన్ క్రానికల్ చైర్మన్ వెంకట్రామిరెడ్డిని, వైస్ చైర్మన్ను సిబిఐ అధికారులు సోమవారం ఉదయం తన కస్టడీలోకి తీసుకున్నారు. హైదరాబాదులోని చంచల్గుడా జైలు నుంచి వారిని సిబిఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 27వ తేదీ వరకు సిబిఐ అధికారులు వారిని తమ కస్డడీలో విచారించనున్నారు.
హైదరాబాద్కు వచ్చిన బెంగళూరు సీబీఐ అధికారులు దక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డిని ఇటీవల అరెస్టు చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జడ్జిల నివాస ప్రాంగణానికి తీసుకెళ్లి సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు.
వెంకట్రామిరెడ్డిని, అతని సోదరుడు రవి రెడ్డిని 14 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ ఇంతకు ముందు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇదిలావుంటే, వెంకట్రామి రెడ్డి, రవిరెడ్డి తమకు చంచల్ గూడ జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని పిటిషన్ దాఖలు చేసుకున్నారు.
తమ భర్త అరెస్టు అక్రమమని వెంకట్రామి రెడ్డి, రవిరెడ్డిల భార్యలు కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి అరెస్టు చేశారని, నోటీసులు ఇవ్వలేదని, వారి పరువుకు నష్టం కలిగించారని వారి తరఫు న్యాయవాది అన్నారు. తాము పదిసార్లు నోటీసులు ఇచ్చాకే అరెస్టు చేశామని సీబీఐ చెప్పింది.
ఉద్దేశపూర్వకంగా బ్యాంకులను మోసం చేసినందుకు వెంకట్రామి రెడ్డిపై ఐపీసీ 420, 120(బీ), 468, 471 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. తంలో వివిధ బ్యాంకుల్లో రూ.1230 కోట్ల మేర వెంకట్రామి రెడ్డి లోను తీసుకున్నారు. అయితే ఆయన అన్ని బ్యాంకుల్లోనూ ఒకే ఆస్తిని తనఖా పెట్టినట్లు కెనరా బ్యాంకు గుర్తించింది.