డీసీ వెంకట్రామిరెడ్డి సోదరులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు
హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. రూ. 5లక్షల పూచీకత్తుతో నాంపల్లి న్యాయస్ధానం వెంకట్రామిరెడ్డి సోదరులకు బెయిల్ మంజూరు చేసింది. కెనరా బ్యాంకును మోసం చేసిన కేసులో ఆయన అరెస్టై రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే.
ఫోర్జరీ పత్రాలతో రూ. 600 కోట్ల వరకు రుణాలు పొంది బ్యాంకులను మోసం చేశారన్న ఆరోపణలపై బెంగుళూరు సీబీఐ అధికారులు వెంకట్రామిరెడ్డిని అరెస్టు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి అరెస్టు చేశారని, నోటీసులు ఇవ్వలేదని, వారి పరువుకు నష్టం కలిగించారని వారి తరఫు న్యాయవాది అన్నారు.
తాము పదిసార్లు నోటీసులు ఇచ్చాకే అరెస్టు చేశామని సీబీఐ చెప్పింది. కాగా, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని నిందితులకు కోర్టు తెలిపింది. దీంతో వారు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అంతక ముందు అతనిని అతని సోదరుడు రవి రెడ్డిని 14 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాని విచారణను కోర్టు 19వ తేదీకి వాయిదా వేసింది. అలాగే, వెంకట్రామి రెడ్డి, రవిరెడ్డి తమకు చంచల్ గూడ జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పైన విచారణను కోర్టు 18వ తేదీకి వాయిదా వేసింది. తమ భర్త అరెస్టు అక్రమమని వెంకట్రామి రెడ్డి, రవిరెడ్డిల భార్యలు కోర్టును ఆశ్రయించారు. రూ. 1230 కోట్ల మేర రుణం తీసుకుని తమను మోసం చేశారని కెనరా బ్యాంక్ చేసిన ఫిర్యాదు మేరకు సిబిఐ అధికారులు కేసు నమోదు చేసి, వెంకట్రామిరెడ్డిని అరెస్టు చేశారు.
నకిలీ పత్రాలతో దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ రూపొందిందని, ఈ వ్యవహారంలో తమకు రూ.357.77 కోట్ల మేర నష్టం వాటిల్లిందని బ్యాంక్ ఫిర్యాదు చేసింది. ఈ విచారణలో ఫోర్జరీ పత్రాలతో బ్యాంకులను మోసం చేసినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.