Executive Capital: అక్వా లోడ్ ఎత్తారు: విశాఖలో వాలిన తొలి కార్గో విమానం: చేపలు, రొయ్యల తరలింపు..!
విశాఖపట్నం: రాష్ట్ర పరిపాలనా రాజధానిగా ఆవిర్భవించబోతున్న సాగర నగరం విశాఖపట్నంలో మరో సరికొత్త రవాణా వసతి అందుబాటులోకి వచ్చింది. వాయు మార్గంలో సరుకులను తరలించడానికి అవసరమైన కార్గో విమాన సర్వీసులు మంగళవారం ఆరంభం అయ్యాయి. ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు తొలి కార్గో విమానం విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ప్రైవేటు విమానయాన సంస్థ స్పైస్ జెట్.. ఈ సర్వీసులను ఆరంభించింది.
వైజాగ్ టు..
విశాఖపట్నం నుంచి కోల్కత, సూరత్, చెన్నైలకు సరుకుల రవాణాను చేపట్టడానికి స్సైస్ జెట్ ముందుకొచ్చిందని విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఈ మధ్యాహ్నం వారు ఓ ట్వీట్ చేశారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రారంభించిన మెరైన్ కృషి ఉడాన్ పథకంలో భాగంగా ఈ సరుకుల రవాణా సర్వీసులు ఆరంభమైనట్లు పేర్కొన్నారు. ఒక్కో విమానం 18 టన్నుల సామర్థ్యం గల సరుకులను మోసుకెళ్తుందని తెలిపారు.
చెన్నై నుంచి బయలుదేరి..
స్పైస్ జెట్ సంస్థకు చెందిన కార్గో విమానం చెన్నై నుంచి బయలుదేరి ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. సరుకులను లోడ్ చేసిన తరువాత.. సూరత్కు బయలుదేరి వెళ్తుంది. రెండు గంటల ప్రయాణం తరువాత సూరత్లో ల్యాండ్ అవుతుంది. ఇంతకుముందు సూరత్, చెన్నై లేదా కోల్కత వంటి నగరాలకు చేపల ఉత్పత్తులను చేరవేయడానికి అక్వా రైతులు రోడ్డు మార్గం మీద ఆధారపడే వారు. దానివల్ల నష్టం అధికంగా ఉండేది. ఇప్పుడా సమస్య తీరినట్టయింది.
ఉత్తరాంధ్ర అక్వా రైతులకు ఊరట కలిగినట్టే..
ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం సహా కోస్తా ప్రాంతంలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన అక్వా రైతులకు ఈ కార్గో విమాన సర్వీసు వల్ల ఊరట లభించినట్టయింది. ఈ అయిదు జిల్లాలు కూడా చేపల ఉత్పత్తులకు పెట్టింది పేరు. రోజూ 10 నుంచి 12 టన్నుల వరకు సముద్రపు ఉత్పత్తులు నమోదవుతుంటాయి. వాటిని సత్వరమే గమ్యస్థానాలకు విక్రయించడానికి లేదా తరలించడానికి ఈ విమాన సర్వీసులు దోహదపడతాయని అంటున్నారు అక్వా రైతులు.
షెడ్యూల్ ఇదీ
విశాఖపట్నం మీదుగా చెన్నై నుంచి గుజరాత్లోని సూరత్కు బయలుదేరి వెళ్లే కార్గో విమానం సోమ, బుధ, శుక్రవారాల్లో రాకపోకలు సాగిస్తుంది. విశాఖపట్నం మీదుగా చెన్నై నుంచి కోల్కతకు బయలుదేరి వెళ్లే మరో విమానం మంగళ, గురు, శుక్రవారాల్లో రాకపోకలు సాగిస్తుందని విశాఖపట్నం విమానాశ్రయం అధికారులు వెల్లడించారు. ఏడాదిలో 135, 246 రోజుల పాటు ఈ విమాన సర్వీసులు రాకపోకలు సాగిస్తాయని తెలిపారు.
First dedicated cargo from @flyspicejet , Spice express landed at Vizag airport almost 30 min back.
— Vizag International Airport 🇮🇳 (#Flyvizag) (@Vizag_Airport) February 25, 2020
It's a boeing 738, landed here from chennai.@Justice_4Vizag @Sudeer1972 @UttarandhraNow @OfficialMvv @ysjagan @vizagities @DigitalValley_ @asb_ambati @cpt_t88 pic.twitter.com/AiKUNSYUwI