కాకినాడ వద్ద తీరం దాటిన వాయుగుండం-ఏపీలో భారీ వర్షాలు- రేపు మరో అల్పపీడనం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ ఉదయం కాకినాడ సమీపంలో తీరాన్ని దాటింది. నరసాపురం-కాకినాడ మధ్య వాయుగుండం తీరం దాటినట్లు వాతావారణ శాఖ నిర్ధారించింది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదిలిన వాయుగుండం కాకినాడ సమీపంలో తీరం దాటడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. దీని ప్రభావంతో గోదావరి జిల్లాల్లో అతి భారీవర్షాలు, మిగతా జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాల్లో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
తీరం దాటిన తీవ్ర వాయుగుండం తిరిగి వాయుగుండంగా, ఆ తర్వాత అల్పపీడనంగా మారనుంది. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోందని వాతావరణశాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, విదర్భ, మరఠ్వాడా ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం విశాఖ, కాకినాడ, నరసాపురం తీరాల్లో సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా ఉంది. మత్సకారులు వేటకు వెళ్లకుండా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Recommended Video
భారీవర్షాల కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్ధితిని సమీక్షిస్తున్నట్లు విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు ప్రకటించారు. భారీవర్షాలతో పోలీసుశాఖ కూడా అప్రమత్తమైంది. ఇబ్బందులు ఎదురైతే 100 లేదా 112కు సమాచారం అందించాలని డీజీపీ గౌతం సవాంగ్ కోరారు. జిల్లా కలెక్టర్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్తో సమన్వయం చేసుకోవాలని సూచించారు.