‘థాంక్యూ అమరావతి’: దీపికా ఏమన్నారంటే, రానా ఇలా(పిక్చర్స్)
Recommended Video
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తనకు ఎంతో నచ్చిందని, ఇక్కడ చుట్టూ ఉన్న పచ్చదనం ఎంతో ఆకట్టుకుందని ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనె అన్నారు. విజయవాడలో ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 'సోషల్ మీడియా సమ్మిట్ 2017 అవార్డు' ప్రదానోత్సవానికి ఆమె హాజరయ్యారు.
థాంక్యూ అమరావతి..
సామాజిక మాధ్యమంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నటిగా దీపికకు అవార్డును రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అందజేశారు. ఈ సందర్భంగా నటి దీపికా మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సోషల్ మీడియా చాలా బలమైన మాధ్యమంగా మారింది. నాకు ఈ స్థాయి గుర్తింపు రావడానికి అభిమానులే కారణం. ఇక్కడా ఇంతమంది అభిమానులు ఉండటం ఆనందంగా ఉంది.. ‘థాంక్యూ అమరావతి'' అని దీపికా సంతోషం వ్యక్తం చేశారు.
మళ్లీ వస్తా..
‘నేను సోషల్ మీడియాలో ఏం చేసినా ఆలోచించే చేస్తాను. ఈ మాధ్యమాన్ని ఎలా వినియోగించుకోవాలో బాగా తెలుసు. ఉన్నంత వరకూ ఎక్కువ ప్రభావాన్ని చూపించగలుగుతాను. నా అభిమానులతో సోషల్ మీడియాలో పారదర్శకంగా ఉంటాను. నా సినిమాలు, పని, ఎక్కడికైనా వెళ్లినా అలాంటి సమాచారం మాత్రం ఎప్పటికప్పుడు తెలియజేస్తాను. నాకు, అభిమానులకు మధ్య ఓ స్పష్టమైన అవగాహన దీని ద్వారానే కుదిరింది. ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. అమరావతి ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని, మళ్లీ త్వరలోనే ఇక్కడికి వస్తాను...' అని దీపికా పదుకొనె చెప్పారు.
దీపికకు కష్టం లేకుండా చేస్తాం
ఈ సందర్భంగా మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని తొలిసారి విజయవాడలో జరిపామని, భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈసారి నేరుగా ముంబై నుంచి విజయవాడకు మధ్యలో ఎక్కడా ఆగాల్సిన పనిలేకుండా చేరుకునేలా దీపికకు విమాన సౌకర్యం కల్పిస్తామంటూ ఆమె నవ్వుతూ తెలిపారు. కాగా, ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన దీపిక అక్కడ కొంత సమయం వేచి ఉండి అనంతరం విజయవాడ చేరుకున్నారు.
రానా, అనిరుధ్లకు అవార్డులు
సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే సినీ నటుడు దగ్గుబాటి రానా, ‘కొలవెరి డి' పాటతో సంచలనం సృష్టించిన సంగీత దర్శకుడు అనిరుధ్, తెలుగులో ప్రముఖ హాస్యనటుడిగా గుర్తింపు పొందిన వైవా హర్ష ఈ అవార్డులను అందుకున్న వారిలో ఉన్నారు. వీరితో పాటు యూట్యూబ్లో వంటలు, హాస్యం, సాంకేతికత, గేమింగ్, పిల్లల ఛానెళ్లను నిర్వహించే వారికీ కూడా అవార్డులను అందజేశారు. కాగా, ఈ కార్యక్రమంలో దీపికా, రానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.