మొన్న మంగళగిరి..ఈ సారి కుప్పం: వైసీపీ టార్గెట్ ఇదే: గోవిందా..గోవిందా: సాయిరెడ్డి
అమరావతి: రాష్ట్రంలో కొద్దిరోజులుగా జమిలి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సోషల్ మీడియా వేదికగా అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశంపై స్పందిస్తున్నాయి. వన్ నేషన్, వన్ ఎలక్షన్ క్యాంపెయిన్ క్రమంగా ఊపందుకుంటోంది. ఒకే దేశం.. ఒకే ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా చేసిన ప్రకటన అనంతరం క్రమంగా జమిలి ఎన్నికలను నిర్వహిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
ఈ పరిణామాల మద్య తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. మరో రెండు మూడేళ్లలో తాము అధికారంలోకి రాబోతోన్నామంటూ చంద్రబాబు ఇదివరకు వ్యాఖ్యానించారు. అయిదుశాతం ఓటు బ్యాంకును తాము మళ్లించుకోగలిగితే.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలవుతుందని ఆయన బేరీజు వేస్తున్నారు.
మొన్నటికి మొన్న అమరావతి ఉద్యమం ఏడాది పూర్తయిన సందర్భంగా కూడా చంద్రబాబు జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. అమరావతి ఉద్యమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని.. రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలందరూ తమ పదవులకు రాజీనామా చేయాలని, మధ్యంతర ఎన్నికలకు వెళ్దామని సవాల్ విసిరారు. ఇక ముందు ఎలాంటి ఎన్నికలను నిర్వహించాల్సి వచ్చినా.. అందులో వైసీపీకి ఘోర పరాజయం తప్పదనీ ఆయన జోస్యం చెప్పారు.
చంద్రబాబు చేస్తోన్న ఈ వ్యాఖ్యల పట్ల వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి మరోసారి స్పందించారు. జమిలి ఎన్నికల్లో చంద్రబాబు, ఆయన పార్టీకి మరింత దారుణంగా ఓడిపోవడం ఖాయమని అన్నారు. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మంగళగిరిలో చంద్రబాబు తన కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ను ఓడగొట్టుకున్నారని ఎద్దేవా చేశారు అదే తరహా ఫలితం ఈ సారి కుప్పంలో వెలువడుతుందని సాయిరెడ్డి అన్నారు.
కుప్పంలో చంద్రబాబు పని గోవిందా.. గోవిందా అవుతుందని చురకలు అంటించారు. అయిదేళ్ల పాటు అధికారంలో ఉండి కూడా అమరావతి ప్రాంతానికి గుండెగా భావించే మంగళగిరిలో చంద్రబాబు తన కుమారుడిని గెలిపించుకోలేకపోయారని గుర్తు చేశారు. అవే తరహా ఫలితాలు కుప్పం సహా అన్ని నియోజకవర్గాల్లోనూ వెలువడతాయని అన్నారు. జమిలి ఎన్నికలకు వెళ్దామని సవాల్ విసురుతోన్న చంద్రబాబు కావాలంటే తన ఎమ్మెల్యేల అందరితో రాజీనామా చేసి రెడీ కావాలని సాయిరెడ్డి ప్రతిసవాల్ విసిరారు.