ఎన్డియేని ఓడించి దేశాన్ని కాపాడాలి...చంద్రబాబు నాయకత్వంలో పోరాటం:కర్ణాటక సిఎం కుమారస్వామి
Recommended Video
విజయవాడ:జేడీఎస్, టీడీపీ సోదరభావం ఉన్న పార్టీలని...ఎన్డీయేను ఓడించడమే తమ లక్ష్యమని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. ఎన్డీఏని గద్దె దించే కూటమికి సంబంధించి ప్రధాని అభ్యర్థి ఎవరనేది ముఖ్యంకాదని...ఎన్డీయేను ఓడించి దేశాన్ని కాపాడాలనేదే ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.
కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఆయన బెజకవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చారు. బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం కోసం విజయవాడ విచ్చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం, మాజీ ఎంపీ లగడపాటి, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తదితరులు ఘన స్వాగతం పలికారు.
ఆ విషయమై...కోరుకున్నా
అనంతరం ఆయన కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు.
శ్రావణ శుక్రవారం కావడంతో కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
అనంతరం రాజకీయ భేటీల విషయమై మాట్లాడుతూ ఎన్డియేని ఓడించేందుకు వీలైనన్ని ఎక్కువ ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోయేలా చూస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేని ఓడించే విషయమై భావసారూప్యం ఉన్న పార్టీలతో ఇప్పటికే అనేకమార్లు చర్చలు జరిపామని తాజాగా చంద్రబాబుతో భేటీ కూడా అందుకు కొనసాగింపే నన్నారు.
చంద్రబాబు...విజన్ ఉన్న నేత
చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని..కనీసం రాజధాని సైతం లేని రాష్టాన్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నారని ప్రస్తుతించారు.అమరావతి నిర్మాణం సజావుగా జరగాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు.17 ప్రాంతీయ పార్టీలను ఒక వేదిక పైకి తీసుకు రావడంలో చంద్రబాబు సఫలం అయ్యారని... చంద్రబాబు తో తొలి మీటింగ్ లో ప్రస్తుత రాజకీయాల పై చర్చించామని చెప్పారు.
ఆయన నాయకత్వంలో...పోరాటం
చంద్రబాబు నాయకత్వంలోనే ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు కుమారస్వామి చెప్పారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా తన 100 రోజుల పాలన సంతృప్తికరంగా ఉందన్నారు. గేట్ వే హోటల్ లో బసచేసిన కర్ణాటక సిఎం కుమారస్వామి అమ్మవారి దర్శనానికి వెళ్లే ముందే ఎపి సిఎం చంద్రబాబు ఆయనతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లే ముందు సుమారు 40 నిమిషాల పాటు కుమారస్వామితో సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాలపాటు వీరి భేటీ సాగింది. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు దేవినేని, ప్రత్తిపాటి, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రాంతీయపార్టీలు...అన్నీ కలవాలి
భేటీ అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. మర్యాదపూర్వకంగా తాము కలిసినట్లు.. ప్రాథమికంగా కొన్ని చర్చలు జరిపినట్లు తెలిపారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకొనేవిధంగా అన్ని ఆలోచిస్తున్నామని చెప్పారు. ఎన్డీయేను ఓడించడమే లక్ష్యంగా కలిసొచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొనిపోతామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపై తీసుకురావాలని...దక్షిణాదిలోని ప్రాంతీయ పార్టీలు కూడా కలవాల్సిన అవసరముందని చంద్రబాబు అన్నారు. తాము మరోసారి భేటీ కావాలని నిర్ణయించామని చంద్రబాబు తెలిపారు.