జగన్ ఖుషీ: 20 మంది ఎమ్మెల్యేల్లో వణుకు, బాబు ఏం చేస్తారు?
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరిన 12 మంది శాసనసభ్యుల విషయంలో చోటు చేసుకున్న పరిణామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలకు వణుకు పుట్టిస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి దాదాపు 20 మంది శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార టిడిపిలోకి ఫిరాయించిన విషయం తెలిసిందే.
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన వారి విషయంలో 3నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు స్పీకర్ మధుసూదనాచారిని ఆదేశించిన నేపత్యంలో తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆందోళన పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలలో ప్రారంభమైంది. హైకోర్టు ఆదేశం మేరకు 90 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తన వద్ద ఉన్న అనర్హత పిటిషన్లు విచారించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.
ఈ పరిణామం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను సంతోషపెడుతుండగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు తీర్పు ప్రభావం ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై కూడా పడే అవకాశం ఉంది.. ఇప్పటికే స్పీకర్ వద్ద ఫిరాయింపులకు సంబంధించిన ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నందున, తెలంగాణలో తెదేపా మాదిరిగానే, ఏపిలోనూ వైసీపీ కూడా కోర్టుకెక్కితే తమ పరిస్థితి ఏమిటనే సందేహం వారిని పీడిస్తోంది.
ఈ విషయంలో ఏపి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియడం లేదు. తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి కూడా ఏం చేస్తారనేది అంతు చిక్కడం లేదు. అయితే, హైకోర్టు తీర్పు దృష్ట్యా వైసిపి కోర్టుకు వెళ్లి, ఆదేశాలు పొందే వరకు వేచి చూస్తారా, ముందుగానే నిర్ణయం తీసుకుంటారా అనేది తేలడం లేదు.
హైకోర్టు తీర్పు దృష్ట్యా, ఏపి స్పీకర్ కూడా నైతిక విలువలు పాటించి, ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని వైసీపీ నేత అంబటి రాంబాబు ఇప్పటికే డిమాండ్ చేశారు.
తెలంగాణ స్పీకర్ ముందున్న అవకాశం...
తనకున్న విచక్షణాధికారాల మేరకు 12 మంది ఎమ్మెల్యేలు అనర్హులు కాదని తెలంగాణ స్పీకర్ నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. స్పీకర్ చట్టానికి లోబడే నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని, చట్టానికి లోబడి ఉండే ప్రతి అంశంపై న్యాయస్థానంలో సవాల్ చేసే వెసులుబాటు ఉందని తెలంగాణ టిడిపి పక్షాన వాదిస్తున్న న్యాయవాది అంటున్నారు.
మూడునెలల్లోగా స్పీకర్ మధుసూదనాచారి నిర్ణయాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ తిరిగి కోర్టును ఆశ్రయిస్తుందా, లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఎపిలో కూడా ఇటువంటి పరిణామమే చోటు చేసుకోవచ్చు. స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు కోర్టులకు లేదన్న ఒకే ఒక్క వాదనతో అనర్హత కేసును మరికొన్నాళ్లు లాగించవచ్చని, కేసు సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా అప్పటికి ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపడవలసిన పనిలేదంటున్నారు.
కాగా, తెలంగాణలోని టిడిపి మెజారిటీ ఎమ్మెల్యేలు పార్టీ మారారు కాబట్టి ఫిరాయింపులపై వేటు పడకపోయినా అశ్చర్యం లేదని అంటున్నారు. అయితే, ఎపిలో పార్టీ మారిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే సంఖ్య ఫిరాయింపుల చట్ట పరిధిలోకి వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.