నాల్గో అభ్యర్థిపై డైలమా: ఫిరాయింపు ఎమ్మెల్యేలకే వదిలేసిన బాబు
విజయవాడ: రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థిని పోటీకి దింపాలా, వద్దా అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి తమ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకే వదిలేశారు. ఈ విషయాన్ని ఆయన సోమవారం రాత్రి మీడియాతో చెప్పారు.
టిడిపిలో చేరిన 17 మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులతో ఆయన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆ విషయం చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి 11 చార్జిషీట్లలో ముద్దాయి అని, ఈ కేసుల్లో రెండో ముద్దాయి విజయసాయి రెడ్డికి జగన్ రాజ్యసభ టికెట్ ఇచ్చారని అంటూ జగన్ లాంటి వాళ్లు రాజకీయాలకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు.
రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కోసం తీవ్రంగా కసరత్తు చేసినట్లు తెలిపారు. టిజి వెంకటేష్, సుజనా చౌదరిలను రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు, బిజెపి అభ్యర్థిగా సురేష్ ప్రభు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. వారంతా రేపు (మంగళవారంనాడు) నామినేషన్లు వేస్తారని చెప్పారు. టీజి వెంకటేష్ చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారని, సుజనా చౌదరి ఎపి ప్రయోజనాల కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు.
కాగా, రాజ్యసభకు తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు టిజి వెంకటేష్ చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎపి అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే, కాంగ్రెస్ హయాంలో అడవి పందుల్లా రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడు ప్రైవేటు బిల్లు పెట్టిన కాంగ్రెస్ నేతలు అప్పుడేం చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. డిఫెన్స్ విమానంలో బిల్లు వచ్చినప్పుడు ఎక్కడున్నారని ఆయన అడిగారు.
ఈ పాపానికి కాంగ్రెస్ నేతలే బాధ్యత వహించాలని చంద్రబాబు అన్నారు. ఆ రోజు జరిగిన అవమానాన్ని ప్రజలింకా మరువలేదని ఆయన గుర్తు చేశారు. ఏపీలో ప్రజల కష్టాలన్నింటికీ కాంగ్రెస్, వైసీపీలే కారణమని చంద్రబాబు ఆరోపించారు.