రూ.2 కోట్ల ఆశచూపి పదిలక్షలు టోకరా.: మహిళా ఎమ్మెల్సీని బురిడీ కొట్టించాడు
మాయమాటలు చెప్పి తెలంగాణా కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్సీని మోసం చేసిన తోట బాలాజీ నాయుడు అనే వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: సామాన్యులను మోసం చెయ్యడంలో కిక్ ఏముంటుంది అనుకున్నాడో ఏమో ఒక కేటుగాడు ఏకంగా ప్రజాప్రతినిధినే బురిడీ కొట్టించాడు. రూ.2 కోట్లు ఆశ చూపించి ఆమె నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేసుకున్నాడు. డబ్బు తన ఖాతాలో పడటం ఆలస్యం మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి అడ్రస్ లేకుండా పోయాడు. దీంతో ఖంగుతిన్న సదరు ప్రజాప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నేరస్తుడి గుట్టు రట్టయింది.
కాల్ డేటా ఆధారంగా కేసు విచారణ జరిపిన పోలీసులు ఆ కేటుగాడిని అరెస్ట్ చేయ్యడంతో పాటు అతడు ఇప్పటికే ఈ తరహా మోసాలు 40 వరకు చేశాడని తెలిసి ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా తెనాలిలో నివాసం ఉంటున్న తోట బాలాజీనాయుడు అనే ఈ క్రిమినల్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి. ఇతడి వయస్సు 40 సంవత్సరాలు.
నిందితుడు తోట బాలాజీనాయుడు సెప్టెంబరు 12 తేదీన మొదటిసారి తెలంగాణ ఎమ్మెల్సీ ఆకుల లలితకు ఫోన్చేసి తాను తెలంగాణా సచివాలయం ఉద్యోగినని మీ నియోజకవర్గానికి కేంద్రం నుంచి రూ. 2కోట్లు మంజూరయ్యాయని చెప్పాడు. అయితే వాటిని మీ ఖాతాలోకి బదిలీ చెయ్యాలంటే 5 శాతం డబ్బు ముందుగా చెల్లిస్తే చాలని తరువాత అంతా తానే చూసుకుంటానని నమ్మబలికాడు.యి. దీంతో ఆమె తన కుమారుడు దీపక్ ద్వారా అతను చెప్పిన అకౌంట్లో రూ.10 లక్షలు జమ చేయించింది.
అంతే డబ్బు తన ఖాతాలో పడిన మరుక్షణం నుంచే తోట బాలాజీనాయుడు తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన దీపక్ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కాల్ డేటా ఆధారంగా నిందితుడు తోట బాలాజీ నాయుడిని అరెస్ట్ చేశారు.
అయితే పోలీసుల విచారణలో నిందితుడు తోట బాలాజీ నాయుడు పై విజయనగరం, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో మొత్తం 30 చోట్ల పోలీస్ కేసులు ఉన్నాయని తేలింది. అంతకు క్రితమే ఒక కేసులో జైలుకు వెళ్లి 2017 జనవరిలోనే విడుదలైన ఇతడు బుద్ది మార్చుకోకుండా మళ్లీ పాత బాటలోనే నడుస్తున్నట్లు వెల్లడయిందని ఇతడిని అరెస్ట్ చేసిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.