డిగ్రీ, పీజీ పరీక్షలపై వీసీల నుంచి అభిప్రాయ సేకరణ: మంత్రి సురేశ్
ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ, పీజీ పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. మిగతా రాష్ట్రాల్లో డిగ్రీ పరీక్షలు కూడా పాస్ చేయడంతో.. ఏపీలో కూడా చేయాలని ఇతర పార్టీలు కోరుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు సుముఖంగా ఉంది అని.. నిర్ణయం తీసుకుందని వార్తలొచ్చాయి. కానీ తాము సమీక్ష మాత్రమే చేశామని.. పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకోలేదని విద్యాశాఖ మంత్రి సురేశ్ స్పస్టంచేశారు.
పరీక్షలు ఎలా నిర్వహించాలనే అంశంపై సమాలోచనలు చేశామని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణపై యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్లు, అధికారుల సూచనలు తీసుకున్నామని చెప్పారు. అభిప్రాయాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్ను ఆలోచించి, సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని మంత్రి సురేశ్ పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు పరీక్షల నిర్వహణ లేదా రద్దు నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పారు.
మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేయాలని కోరారు. కరోనా వైరస్ వ్యాపిస్తోన్న నేపథ్యంలో విద్యార్థుల అన్నీ పరీక్షలు రద్దు చేయాలన్నారు. పదో తరగతి పరీక్షల మాదిరిగానే మిగతా ఎగ్జామ్స్ కూడా పాస్ చేయాలని సూచించారు. వైరస్ వ్యాప్తి పెరుగుతోన్న నేపథ్యంలో.. విద్యార్థులు పరీక్షల పేరుతో ఇతర పట్టణాలు/నగరాలకు వెళ్లడం అంతా శ్రేయస్కరం కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు. డిగ్రీ, ఎంబీఏ, అగ్రికల్చర్ బీఎస్సీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ పరీక్షలపై కూడా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.