కర్నూలులో ఢిల్లీ గ్యాంగ్ అరెస్టు: అదృశ్యమైన వ్యాపారి మృతి
విజయవాడ: డాలర్ల పేరుతో మోసం చేస్తున్న ఆరుగురు సభ్యుల ఢిల్లీ గ్యాంగ్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్దనుంచి రూ.50 వేల విలువైన డాలర్లు, రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్పారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ముఠాలో ఇతరుల సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నారు.
తూర్పో గోదావరి జిల్లాలో వారం రోజుల క్రితం అదృశ్యమైన ఐ.పోలవరానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి ఫణీంద్ర మృతి చెందాడు. ముమ్మిడివరం మండలం బొమ్మానపల్లిలోని ఓ సెప్టిక్ ట్యాంకులో ఫణీంద్ర మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
హత్యకు ఆర్థికలావాదేవీల వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి, వారి నుంచి మరిన్ని వివరాలు సేకరింస్తామని పోలీసులు తెలిపారు.
ఓ ఇంట్లో చొరబడిన వ్యక్తులు బంగారం దోచుకుని వెళ్లిన సంఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. జిల్లాలోని మక్కువలో ఈ సంఘటన శుక్రవారంనాడు వెలుగు చూసింది. మక్కువలని పాత స్టేట్ బ్యాంక్ వీధిలో నివాసం ఉంటున్న బంగారయ్య పని నిమిత్తం కుటుంబంతో కలిసి బయటకు వెళ్లాడు.
అదే అదనుగా భావించిన దుండగులు ఇంట్లోకి చొరబడి బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.