జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ లేఖ: న్యాయ వ్యవస్థ స్వేచ్ఛకు విఘాతం: ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్
అమరావతి: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ సృష్టించిన ప్రకంపనలు ఇంకా తగ్గట్లేదు. దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చల్లోకి వచ్చింది. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ సహా పలువురు న్యాయ నిపుణులు, ప్రముఖులు ఈ వ్యవహారంలో వైఎస్ జగన్కు అండగా ఉంటున్నారు. ఈ లేఖలో ఆయన పొందుపరిచిన అంశాల పట్ల సత్వర విచారణ జరగాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం ఏర్పడుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.
వర్షాల వల్ల పంట నష్టాన్ని అంచనా వేసిన పవన్ కల్యాణ్: ఇళ్లల్లోనే ఉండండి..బయటికి రావొద్దంటూ
మరోవంక- వైఎస్ జగన్ లేఖ రాయడాన్ని బార్ అసోసియేషన్లు తప్పు పడుతున్నాయి. లేఖ రాసినప్పటికీ.. దాన్ని బహిర్గతం చేయడం, పబ్లిక్ డొమైన్లో ఉంచడం సరికాదంటూ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్ జగన్ చర్యలను తాము తోసిపుచ్చుతున్నామని తేల్చి చెబుతున్నాయి. వైఎస్ జగన్ లేఖ రాయడం.. దాన్ని విలేకరుల సమావేశంలో చదవి వినిపించడం వంటి చర్యలు న్యాయ వ్యవస్థ స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు విఘాతం కల్పించేదిగా ఉందని తాము భావిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.
ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీ ఓ ఏకగ్రీవ తీర్మానాన్ని విడుదల చేసింది. ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి అభిజిత్ ఈ లేఖను విడుదల చేశారు. వైఎస్ జగన్ ఎలాంటి కారణాలనేవే లేకుండా దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారని, అకారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. లేఖ రాయడమే కాకుండా దాన్ని బహిర్గతం చేయడం, పబ్లిక్ డొమైన్లో ఉంచడం వంటి చర్యలు న్యాయవ్యవస్థను ధిక్కరించేవిగా, అగౌరవ పరిచేవిగా ఉన్నాయని అభిజిత్ చెప్పారు.
తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను చేపట్టబోయే హోదాలో ఉన్న జస్టిస్ ఎన్వీ రమణపై అకారణంగా ఆరోపణలను చేయడాన్ని తాము ఖండిస్తున్నామని చెప్పారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన అత్యున్నతంగా పని చేశారని అన్నారు. దేశంలో అత్యున్నత ప్రమాణాలు, విలువలను పాటించే న్యాయమూర్తుల్లో ఎన్వీ రమణ ఒకరిగా ఉన్నారని, అలాంటి వ్యక్తికి వ్యతిరేకంగా వైఎస్ జగన్ లేఖ రాయడం పట్ల తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది.