వైసీపీకి ఢిల్లీ హైకోర్టు షాక్- గుర్తింపు రద్దు పిటిషన్ పై నోటీసులు- ఈసీకి కూడా...
అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన గుర్తింపు రద్దు కేసులో ఢిల్లీ హైకోర్టు ఇవాళ వైసీపీకి షాక్ ఇచ్చింది. తమ పార్టీ పేరులో ఉన్న వైఎస్సార్ పేరును యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పేరుతో ఏర్పాటైన వైసీపీ వాడుకుంటోందని ఆరోపిస్తూ అన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఇదే అంశంపై ఈ పార్టీ ఇంతకుముందే ఎన్నికల సంఘాన్ని కూడా ఆశ్రయించింది. ఈసీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో తమ పార్టీ పేరులో ఉన్న వైఎస్సార్ పదాన్ని వాడుకుంటున్న వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని కోరింది. ఎన్నికల కమిషన్లో నమోదైన ప్రకారం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పేరు వాడాలని, అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పేరు వాడుతున్నారని ఫిర్యాదు చేసింది.
ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నియమావళి ప్రకారం చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరింది. ఈ మేరకు వైసీపీ నేతలు తమ లెటర్ హెడ్లతో పాటు అన్నిచోట్లా వైఎస్సార్ పేరును వాడుతున్న వహారంపై ఆధారాలు కూడా సమర్పించింది. వీటిని పరిశీలించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలంటూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.