కేంద్రకేబినెట్ జాబితా నుంచి సాయిరెడ్డి డ్రాప్..ఆ యువనేతతో సహా ఇద్దరికి ..? జగన్ తేల్చిందేంటి ?
ఏపీలో రాజకీయపరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఒకే వారంలో జగన్ రెండు సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో ఎన్నో వార్తలు ఢిల్లీలో షికారు చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ప్రధాని మోడీతో గంటసేపు భేటీ అయిన ఏపీ సీఎం జగన్ ఆ తర్వాత రెండురోజులకు అంటే శుక్రవారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా పలు రాజకీయపరమైన అంశాలు కూడా చర్చించడం జరిగిందని సమాచారం.
రాజకీయంగా చర్చలు
సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో మోడీ కేబినెట్ విస్తరణ జరుగుతున్న క్రమంలో ఈ భేటీకి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీ కేబినెట్లో వైసీపీ చేరే అవకాశం ఉందంటూ విశ్వసనీయ వర్గాల సమాచారం. శుక్రవారం రోజున అమిత్ షాతో భేటీ అయిన ఏపీ సీఎం జగన్ మోడీ కేబినెట్లో మంత్రులుగా వైసీపీ ఎంపీలు చేరే అంశంపై చర్చించడమే కాకుండా అదే సమయంలో మంత్రుల జాబితాను కూడా ఇచ్చినట్లు సమాచారం. దీనిపై ఒక ఒప్పందం కుదిరాకే పేర్లను ఫైనలైజ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటి వరకు విజయ్సాయిరెడ్డికి కేంద్ర కేబినెట్లో తప్పకుండా చోటు దక్కుతుందని భావించినప్పటికీ పలు కారణాలతో ఆయన పేరును డ్రాప్ చేసినట్లు సమాచారం.
కేంద్ర కేబినెట్ మంత్రి పదవి జాబితాలో విజయ్ సాయిరెడ్డి డ్రాప్
విజయ్ సాయిరెడ్డి ఇప్పటికే పలు పదవులను చేపడుతున్నారు. ఇప్పటికే పార్లమెంటరీ నేతగా సాయిరెడ్డి ఉండటమే కాకుండా.. ఏపీ ప్రభుత్వానికి ఢిల్లీలో ప్రత్యేక సలహాదారుడిగా కూడా కొనసాగుతున్నారు. ఇక విజయ్ సాయిరెడ్డిపై ఉన్న కేసులు, అదే సమయంలో ఆయన కోర్టుకు హాజరుకావాల్సి ఉన్న నేపథ్యంలో సాయిరెడ్డి పేరును మంత్రి పదవికి ప్రతిపాదించడంపై జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. గతంలో సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై పలు విమర్శలు వచ్చిన వియాన్ని గుర్తుకు చేసుకుంటున్నారు.
బీజేపీకి ఒక రాజ్య సభ సీటు
ఇక ఏపీకి మొత్తం 4 రాజ్యసభ సీట్లు వస్తుండగా అందులో ఒకటి బీజేపీకి కేటాయించాలని అమిత్ షా కోరినట్లు సమాచారం. జగన్ ఇందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ప్రత్యేక హోదాపై అమిత్ షా మరోరకంగా హామీ ఇవ్వడంతో జగన్ కేంద్ర కేబినెట్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక డీల్ ప్రకారం వైసీపీకి ముందుగా అనుకున్నట్లుగా రెండు మంత్రి పదవులు కాదని అవసరమైతే మూడోది కూడా ఇచ్చే అవకాశాలున్నాయని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు హయాంలో కూడా రెండు కేంద్ర మంత్రి పదవులు, రెండు రాష్ట్రమంత్రి పదవుల లెక్కన మంత్రి పదవులు పంచుకోవడం జరిగింది.
మిథున్ రెడ్డికి ఛాన్స్ అయితే....
ఢిల్లీలో అర్థరాత్రి జరిగిన మంతనాలతో మంత్రుల జాబితాలో సీఎం జగన్ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. విజయ్ సాయి రెడ్డి స్థానంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువనేత రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి కేబినెట్లో చోటు కల్పించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. లోక్సభ వైసీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్న మిథున్ రెడ్డికి ఢిల్లీలో మంచి సంబంధాలున్నాయి. అదే సమయంలో ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్తో కూడా పెద్దిరెడ్డి కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో మిథున్ రెడ్డి వైపే జగన్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఉండగా మిథున్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి ఇస్తారా అన్న అనుమానం సైతం వ్యక్తమవుతోంది. అయితే జగన్తో ముందునుంచి పెద్దిరెడ్డి కుటుంబం అండగా ఉండటంతో మిథున్కు కచ్చితంగా కేంద్ర మంత్రి పదవికి ప్రతిపాదించాలనే యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఇక మరో ఇద్దరి పేర్లను కూడా మంత్రిపదవికి పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మహిలకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్న జగన్
కేంద్ర కేబినెట్లో వైసీపీ నుంచి మహిళకు మంత్రి పదవి ఇవ్వాలనే యోచనలో సీఎం జగన్ ఉన్నట్లు సమాచారం. ఇక కాపు సామాజిక వర్గంకు ఇవ్వాలని భావిస్తే కాకినాడ ఎంపీ వంగా గీతకు ఛాన్స్ దక్కుతుంది. లేదు ఎస్సీ సామాజిక వర్గంకు ఇవ్వాలని జగన్ భావించినట్లయితే అమలాపురం ఎంపీ చింతా అనురాధా పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మంత్రిపదవికి నందిగం సురేష్ పేరు వినిపించినప్పటికీ సీఎం జగన్ అతని వైపు మొగ్గు చూపడం లేదని తాజా సమాచారం. ఇక ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇచ్చిన నేపథ్యంలో కృష్ణా గుంటూరు జిల్లాకు కేంద్ర మంత్రి పదవులు విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ భావించినట్లు తెలుస్తోంది. ఇక ఇక్కడి నుంచి బీసీ నేతగా ఉన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
ఈ నెలాఖరులోనే మోడీ కేబినెట్ విస్తరణ..?
కేంద్ర కేబినెట్లో చేరాలని అమిత్ షా ఇచ్చిన ఆహ్వానంకు ఒప్పుకున్న జగన్... మండలి రద్దుకు ఓకే చేయాలని కోరినట్లు సమాచారం. దీంతో అమిత్ షా కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. మొత్తానికి మిడ్నైట్ డెవలప్మెంట్స్తో ఏపీ రాజకీయాలు మరోసారి మారబోతున్నాయి. ఈ నెలాఖరులోనే మోడీ తన కేబినెట్ను విస్తరించే అవకాశాలున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. ఇదే జరిగితే ఇటు చంద్రబాబుకు అటు పవన్ కళ్యాణ్కు జగన్ చెక్ పెడతారనేది అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.