2002లో గుజరాత్.. 2020లో ఢిల్లీ: రెండు చోట్లా మోడీ ప్రభుత్వ హయాంలోనే మతకల్లోలాలు: ఒవైసీ
గుంటూరు: దేశ రాజధానిలో అట్టుడికించిన అల్లర్లు, హింసాకాండ పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడు కూడా పెదవి విప్పకపోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయని అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఢిల్లీ అల్లర్లలో నిరుపేదలు నిరాశ్రయులయ్యారని, 42 మంది మరణించినప్పటికీ.. ప్రధాని ఎందుకు స్పందించట్లేదని నిలదీశారు.
ఆదివారం గుంటూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రభుత్వాలు ఉద్యమిస్తున్నప్పటికీ.. కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవట్లేదని, దీని వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. అల్లర్లలో నష్టపోయిన బాధిత ప్రజలను పరామర్శించడానికి ప్రధాని ఆయా ప్రాంతాల్లో పర్యటించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఎన్డీఏ కూటమిలో ఉంటూ అధికారాన్ని అనుభవిస్తోన్న ఏ పార్టీకి చెందిన నాయకుడు కూడా ఢిల్లీ అల్లర్లపై ఎందుకు స్పందించట్లేదని అన్నారు.
నరేంద్ర మోడీ అధికార నివాసానికి సమీపంలోనే ఇంత భారీ ఎత్తున మారణకాండ చోటు చేసుకున్నప్పటికీ.. ఆయన మౌనంగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. అల్లర్లు చోటు చేసుకున్న ప్రాంతాల్లో పర్యటించడం ద్వారా బాధిత కుటుంబాలకు నైతిక ధైర్యాన్ని ఇచ్చినట్టు ఉంటుందని చెప్పారు. 2002లో గుజరాత్లో జరిగిన మారణహోమంతో ప్రధాని నరేంద్రమోడీ గుణపాఠం నేర్చుకుంటారని తాను అనుకున్నానని, 2020లో ఢిల్లీలో ఇది చోటుచేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో మోడీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని, 2020లో ప్రధానిగా ఢిల్లీలో ఉండగా.. మళ్లీ అల్లర్లు చోటు చేసుకున్నాయని విమర్శించారు. ఈ అల్లర్లలో మరణించిన వారు ఏ ఒక్క వర్గానికో చెందిన వారుగా పరిగణించకూడదని, వారంతా భారతీయులని అన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ మిశ్రా చేసిన వ్యాఖ్యల తరువాతే ఢిల్లీలో అల్లర్లు చోటు చేసుకున్నాయని, దీనికి ప్రధానే సమాధానం చెప్పాలని అసద్ డిమాండ్ చేశారు.