జగన్తో భేటీ కాబోతోన్న టాలీవుడ్ ప్రముఖులు వీరే: స్పెషల్ అట్రాక్షన్ రాజమళి: లిస్టులో లేని
అమరావతి: తెలుగు చిత్ర పరిశ్రమలకు చెందిన కొందరు ప్రముఖులతో కూడిన ప్రతినిధుల బృందం కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకోబోతోంది. ఈ టీమ్కు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వాన్ని వహించబోతున్నారు. మొత్తం 25 మంది టాలీవుడ్ ప్రతినిధులతో ఏర్పడిన టీమ్ ఈ మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్తో సమావేశం కానుంది. నటులు, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్ల విభాగం నుంచి ప్రతినిధులను ఎంపిక చేశారు. ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఆహ్వానం ఉన్నప్పటికీ.. ఆయన కలవట్లేదు.
అభిమాని పిలిచినా: జగన్తో భేటీకి బాలయ్య డుమ్మా: పైకి చెబుతోందొకటి: విషయం వేరొకటి?
అన్నీ పెద్ద తలకాయలే..
మెగాస్టార్ చిరంజీవి సారథ్యాన్ని వహించే ఈ టీమ్లో అక్కినేని నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, జెమిని కిరణ్, జీవిత, రాజశేఖర్, సీ కల్యాణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, ఛోటా కే నాయుడు వంటి ప్రముఖులు ఉన్నారు. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా రాష్ట్రంలో సినిమా షూటింగులకు అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఙత తెలుపుకోవడంతో పాటు ఇండస్ట్రీ ఎదుర్కొంటోన్న కొన్ని అంశాలను పరిష్కరించడానికి వారంతా వైఎస్ జగన్ను కలుసుకోనున్నారు. విశాఖలో చిత్ర పరిశ్రమను స్థాపించడానికి పుష్కలమైన వనరులు ఉన్నాయనే అభిప్రాయం ప్రస్తుతం టాలీవుడ్లో వినిపిస్తోంది.
స్టూడియోల నిర్మాణానికి ప్రోత్సాహం
చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరమూ నటులు, దర్శకులు, టెక్నీషియన్లు, నేపథ్య గాయకులు, సంగీత దర్శకులకు ఇచ్చే నంది అవార్డులను పునరుద్ధరించడం, ఎంటర్టైన్మెంట్ ట్యాక్సులు, స్టూడియోలను నిర్మించడానికి అవసరమైన భూములను కొనుగోలు చేయడంలో రాయితీలను కోరబోతున్నారని తెలుస్తోంది. విభజన తరువాత 13 జిల్లాలతో ఏర్పాటైన ఏపీలో చిత్ర నిర్మాణాలను ప్రోత్సహించడం, స్టూడియోల నిర్మాణానికి రాయితీతో కూడిన భూములను కేటాయించడం వంటి చర్యలు రాష్ట్రాభివృద్ధికీ కారణమౌతాయనే అభిప్రాయం ఉంది.
ఏడాది తరువాత సీఎంతో
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ప్రతీసారి.. చిత్ర పరిశ్రమ పెద్దలు ఓ టీమ్గా ఏర్పడి కొత్త ముఖ్యమంత్రిని మర్యాదపూరకంగా కలుస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. ఏపీ విషయంలో టాలీవుడ్ పెద్దలు ఈ ఆనవాయితీని కొనసాగించడానికి ఏడాది సమయం పట్టింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏడాది తరువాత ఆయనతో భేటీ కాబోతున్నారంటే అది ప్రాధాన్యత కలిగిన విషయమే. కారణాలు ఏమైనప్పటికీ.. ఏడాది తరువాతైనా టాలీవుడ్ ప్రముఖులు వైఎస్ జగన్ను కలుసుకోబోతున్నారు.
బాలయ్య గైర్హాజర్
బాలకృష్ణ ఈ టీమ్తో కలవట్లేదు. ఆయన జగన్ను కలుసుకోవట్లేదు. రాజకీయంగా తీసుకుంటే.. బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. తన రాజకీయ ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలను కలుసుకోవడం బాలకృష్ణకు ఇష్టం లేకపోవచ్చు. సినీ పరిశ్రమ వైపు నుంచి చూసుకుంటే- మెగాస్టార్ చిరంజీవితో నెలకొన్న విభేదాలు. వైఎస్ జగన్ను కలుసుకోబోయే టీమ్ను మెగాస్టార్ లీడ్ చేయడం, ఆయన సారథ్యాన్ని వహించే టీమ్లో తాను సభ్యుడిగా ఉండటం బాలకృష్ణకు ఇష్టం లేదనే చెబుతున్నారు.
Recommended Video
ప్రత్యేక ఆకర్షణగా రాజమౌళి
ఈ టీమ్లో దర్శకుడు రాజమౌళి చేరడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని అంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణానికి అవసరమైన డిజైన్ల కోసం రాజమౌళి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశం అయ్యారు. కొన్ని డిజైన్లను కూడా ఆయనఅప్పటి ప్రభుత్వానికి అందజేశారు. చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉందనే టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది. ఈ సారి రాజమళి కూడా ఈ టీమ్లో ఉండటం చర్చనీయాంశమౌతోంది.