ఒక్క హైకోర్టు..మూడు ఉద్యమాలు: అటు రాయలసీమ.. ఇటు ఉత్తరాంధ్ర మధ్యలో అమరావతి!
విశాఖపట్నం: ఈ సారి ఉత్తరాంధ్ర వంతు వచ్చినట్టుంది. శాశ్వత హైకోర్టు భవనాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయాలంటూ ఆ ప్రాంతానికి చెందిన న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఒకవంక కొనసాగుతుండగా.. మరోవంక ఉత్తరాంధ్ర కూడా ఇదే డిమాండ్ పై ఉద్యమానికి సన్నద్ధమైంది. హైకోర్టును విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని కోరుతూ ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ఆందోళనలు మరోసారి మొదలయ్యాయి. ఇందులో భాగంగా.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన న్యాయవాదులు, బార్ అసోసియేషన్లు తమ విధులను బహిష్కరించారు.. రోడ్డెక్కారు. హైకోర్టును విశాఖలో నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
ఉగ్రవాదులు రూటు మార్చారా: సౌదీ తరహాలో డ్రోన్లతో దాడులు? ఇంటెలిజెన్స్ ఏం చెబుతోంది?
మూడురోజుల పాటు విధుల బహిష్కరణ..
ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన న్యాయవాదులు మూడు రోజుల పాటు విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూడు జిల్లాల్లో బుధ, గురు, శుక్రవారాల్లో న్యాయవాదులు తమ విధులకు గైర్హాజరు కానున్నారు. జిల్లా కేంద్రాలవారీగా ఆందోళనలను నిర్వహించారు. బుధవారం శ్రీకాకుళంలో న్యాయవాదుల నిరసన ప్రదర్శనలు, బైఠాయింపులు కొనసాగాయి. గురువారం విజయనగరంలో వారి ఆందోళనలు కొనసాగుతున్నాయి. జిల్లా న్యాయస్థానాన్ని కేంద్రబిందువుగా చేసుకుని న్యాయవాదులు పోరాటం చేస్తున్నారు. న్యాయస్థానం ఎదురుగా నిరసన ప్రదర్శనలను చేపట్టారు. బైఠాయించారు. విశాఖలో హైకోర్టు ఏర్పాటుచేయాలి...ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలి అంటూ నినదించారు.
రిలే నిరాహార దీక్షలకు సన్నాహాలు
తమ డిమాండ్ పట్ల ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాకపోతే రిలే నిరాహార దీక్షలకు దిగుతామని బార్ అసోసియేషన్ల నాయకులు హెచ్చరించారు. అధికారాన్ని వికేంద్రీకరిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. హైకోర్టు సహా అన్ని రకాల కార్యకలాపాలను ఒక్క రాజధాని అమరావతి ప్రాంతానికి మాత్రమే పరిచయం చేయకూడదని సూచిస్తున్నారు. హైకోర్టును శాశ్వతంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని, ఫలితంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు కొద్దో, గొప్పో అభివృద్దికి నోచుకుంటాయని చెబుతున్నారు. ప్రస్తుతం అమరావతి ప్రాంతంలోని నేలపాడులో నిర్మించిన హైకోర్టును కర్నూలుకు తరలిస్తారనే విషయం తమను ఆందోళనకు గురి చేస్తోందని అన్నారు. కర్నూలుకు తరలిస్తే.. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోబోయేది లేదని స్పష్టం చేశారు.
చల్లారని రాయలసీమ..
ఇదిలావుండగా.. కర్నూలులో హైకోర్టను ఏర్పాటు చేయాలని కోరుతూ కొద్దిరోజులుగా రాయలసీమ ప్రాంత న్యాయవాదులు చేస్తోన్న ఉద్యమాలు, రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీ వర్షాన్ని కూడా వారు లెక్క చేయట్లేదు. కర్నూలులోని రాజ్ విహార్ సెంటర్ లో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో బైఠాయించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే రాజధానిని కోల్పోయిన తాము అనేక విధాలుగా నష్టపోయామని, ఈ సారి హైకోర్టును ఏర్పాటు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమకు ద్రోహం చేసినట్టు అవుతుందని న్యాయవాదులు చెబుతున్నారు.
గుంటూరులో అదే పరిస్థితి..
ప్రస్తుతం రాజధాని ప్రాంతంలోని నేలపాడులో ఉన్న హైకోర్టును యధాతథంగా కొనసాగించాలంటూ గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన న్యాయవాదులు డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. హైకోర్టును తరలించడానికి తాము ఎంతమాత్రమూ అంగీకరించబోమని ఆయా జిల్లాల న్యాయవాదులు ఇప్పటికే ఆందోళనల పర్వానికి శ్రీకారం చుట్టారు. దీన్ని మరింత ఉధృతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గుంటూరు న్యాయవాదుల సారథ్యంలో ఏర్పాటైన అయిదు జిల్లాల బార్ అసోసియేషన్ల సమాఖ్య ఇదివరకే విధులను బహిష్కరించింది. వెనక్కి తగ్గబోమని హెచ్చరించింది.
ప్రభుత్వ వైఖరేంటీ?
హైకోర్టు కోసం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఒకేసారి ఉద్యమాలు పుట్టుకుని రావడం ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రస్తుతానికి దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గానీ, మంత్రులు గానీ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. సున్నితమైన సమస్య కావడం వల్ల ఆచితూచి వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం మాత్రం కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడం వైపే మొగ్గు చూపుతోందనేది సుస్పష్టం. అయినప్పటికీ.. రాజధాని అమరావతి సహా విశాఖపట్నంలో డివిజన్ బెంచ్ లను ఏర్పాటు చేసి, ఈ సమస్యకు పరిష్కారం చూపాలని భావిస్తోంది.