కర్నూలుపై టిజి వెంకటేష్ పట్టు, చంద్రబాబుకు చిక్కు: 'ప్రత్యేక సీమతో నష్టం'
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండో రాజధానిగా కర్నూలును చేయాల్సిందేనని మాజీ మంత్రి టిజి వెంకటేష్ శుక్రవారం నాడు మరోసారి డిమాండ్ చేశారు. ఏపీకి కర్నూలును రెండో రాజధాని చేయాలని ఆయన చాలా రోజులుగా కోరుతున్నారు.
కర్నూలును రెండో రాజధానిగా చేయకుంటే ప్రత్యేక రాయలసీమ డిమాండ్ పెరుగుతుందని టిజి వెంకటేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును హెచ్చరించారు.
రాజధాని అమరావతిని మాత్రమే అభివృద్ధి చేయకుండా రాయలసీమ ప్రాంతాన్ని పట్టించుకోవాలన్నారు. శ్రీభాగ్ ఒడంబడికను గుర్తుంచుకోవాలన్నారు.
ఏపీలో ఆయిల్ రిఫైనరీ నెలకొల్పండి: చంద్రబాబు
ఏపీలో ఆయిల్ రిఫైనరీని నెలకొల్పాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆల్ అఫ్రాజ్ గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అధినేత సౌద్ ఆల్ అఫ్రాజ్ను శుక్రవారం కోరారు. కువైట్కు చెందిన పారిశ్రామికవేత్త అయిన అఫ్రాజ్ ఏపీ సీఎంతో భేటీ అయ్యారు.
ఏపీ చమురు, పవర్ ప్లాంట్లు, నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాల్లో ప్రసిద్ధి అని ఆయనకు చంద్రబాబు వివరించారు. ఏపీలో పెట్టుబడులు పెడితే కలిగే ప్రయోజనాలు వివరించారు.
కాగా, ప్రత్యేక రాయలసీమ ఉద్యమంతో నష్టమే తప్ప లాభం లేదని ఏపీ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ గురువారం నాడు అన్నారు. అధికారం కోల్పోయాక విభజనవాదాన్ని కొందరు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో డిసెంబర్ 7న నిరసన చేపడతామన్నారు.