'అమరవీరులవల్ల తెలంగాణ: చిహ్నంలో స్థూపమెక్కడ?'
హైదరాబాద్: తెలంగాణ చిహ్నం పైన కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రూపొందించిన రాజముద్రలో కాకతీయుల తోరణం, చార్మినార్ ఉన్నాయి. ఆంగ్లం, తెలంగాణ, ఉర్దూ భాషల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని ఉంటుంది. దీని పైన పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రూపొందించిన రాజముద్ర పైన అభ్యంతరాలు ఉన్నాయని బిజెపి దేవాలయాల పరిరక్షణ విభాగం రాష్ట్ర కన్వీనర్ టి యమన్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ లోగోలో చేర్చిన చార్మినార్ ఓ మతానికి సంబంధించినది కావడం వల్ల దానిని పెట్టవద్దని కోరారు.
మరోవైపు, రాజముద్రలో అమరవీరుల స్థూపాన్ని విస్మరించారని తెలంగాణ బిజెపి కార్యదర్శి ఆచారి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధనలో అమరవీరుల పాత్ర వెలకట్టలేనిదనిదన్నారు. వారిని విస్మరించడం అత్యంత దారుణమన్నారు.
తెలంగాణ రాజముద్రలో అమరవీరుల స్థూపం లేకపోవడాన్ని పలువురు తెలంగాణ కళాకారులు కూడా గుర్తు చేస్తున్నారు. తెలంగాణ రావడంలో కీలక పాత్ర అమరవీరులదని, 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో, ఇప్పటి తెలంగాణ ఉద్యమంలో ఎందరో బలయ్యారని, అలాంటి అమరవీరులకు గుర్తుగా అమరవీరుల స్థూపం ఉందని, తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో.. అలాంటి అమరవీరులకు గుర్తుగా ఉన్న స్థూపాన్ని రాష్ట్ర చిహ్నంలో చేర్చాలంటున్నారు.