'నాగార్జునని జైలుకు పంపాలి': గురుకుల్లో మౌనప్రదర్శన
హైదరాబాద్: వాల్టా చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించడంతో పాటు భూఆక్రమణలకు పాల్పడి తమ్మిడికుంట చెరువులో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించిన సినీ నటుడు నాగార్జున పైన వెంటనే కేసు నమోదు చేసి జైలుకు పంపే విధంగా చర్యలు తీసుకోవాలని సేవ్ అవర్ అర్బన్ లేక్స్ (సోల్) సంస్థ మంగళవారం డిమాండ్ చేసింది. బంజారాహిల్స్లో సోల్ ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు.
ఎఫ్టీఎల్ పరిధిలోని భూమిపై యాజమాన్య హక్కులు ఉన్నప్పటికీ ఆ ప్రదేశంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని, ఎఫ్టీఎల్తో పాటు చెరువు చుట్టుపక్కల ఉన్న బఫర్ జోన్లో సైతం ఎలాంటి కట్టడాలు నిర్మించరాదని గతంలో న్యాయస్థానాలు సైతం తెలిపాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం చెరువులను పరిరక్షించేందుకు ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
గురుకుల్ బాధితుల మౌన ప్రదర్శన
తాము చెమటోడ్చి సంపాదించన దానితో గురుకుల్ ట్రస్టులో భూములు కొనుక్కున్నామని, తమకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆగదని, మంగళవారం సాయంత్రం వెయ్యిమంది గురుకుల్ బాధిత సభ్యులు మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీ ప్రధాన రహదారులపై నోటికి నల్లగుడ్డలు కట్టుకొని మౌనప్రదర్శన నిర్వహించారు.
పైసా పైసా కూడబెట్టి, బంగారాన్ని తాకట్టుపెట్టి, పిల్లల చదువుల కోసమో, కుమార్తె పెళ్లి కోసమో అక్కరకొస్తుందని అయ్యప్ప సొసైటీలో ప్లాట్లు కొనుగోలు చేశామని, ప్రభుత్వం తమ సొసైటీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం అన్యాయమని అయ్యప్ప సొసైటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
1982లో ఒకసారి చట్టబద్ధంగా కొనుగోలు చేసి, వైయస్ హయాంలో యూఎల్సీ, ఎల్ఆర్ఎస్ పేరిట లక్షల రూపాయలు చెల్లించామని, ఇంకా చెల్లిస్తూనే ఉన్నామన్నారు. అయినా అక్రమమంటూ, ఆక్రమణదారులమంటూ కరెంటు కట్ చేయడం భావ్యం కాదని వాపోయారు.
గురుకుల్ ట్రస్టు బాధితులు రెండు రోజుల క్రితం తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డిని కలిసి తమ గోడు వినిపించుకున్నారు. తమ కష్టార్జితంతో సంపాదించి నిర్మించుకున్న ఇళ్ళను నేలమట్టం చేశారని వారు కలిసి చెప్పారు. సమావేశానంతరం బాధితులు శ్రీనివాస్ గౌడ్, జగన్ మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ తమ బాధను పొన్నాలకు, కిషన్ రెడ్డిలకు వివరించామన్నారు. ఇద్దరు అధ్యక్షులు కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు.