నోట్ల రద్దు: ఖాతాదారులకు వైసిపి మద్దతు, రంగంలోకి టిడిపి, తోపులాట
రూ.500, రూ.1000 నోట్ల రద్దు వ్యవహారం తణుకులో వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య వాగ్వాదం, తోపులాటకు దారి తీసింది.
తణుకు: రూ.500, రూ.1000 నోట్ల రద్దు వ్యవహారం తణుకులో వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య వాగ్వాదం, తోపులాటకు దారి తీసింది. నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు చిల్లర కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే.
ఈ రోజు (బుధవారం) తణుకులో పలువురు ఉద్యోగాలు, సామాన్యులు స్టేట్ బ్యాంకు వద్ద డబ్బుల కోసం వరుస కట్టారు. కానీ డబ్బులు చాలామందికి ఇవ్వలేదని తెలుస్తోంది.
దీంతో బ్యాంకులో నగదు చెల్లింపులు చేయడం లేదని ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. వారు బ్యాంకు లోపల బ్యాంకు అధికారులను నిలదీసారు. ఈ సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగంలోకి దిగారు.
ఆందోళన చేస్తున్న ఖాతాదారులతో బ్యాంకు బయట నిరసన చేపట్టారు. నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసిపి నాయకులు మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న ఖాతాదారులకు వారు వంత పాడారు.
ఈ సమయంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించేశారు.
ఓ మహిళ మాట్లాడుతూ.. తమకు డబ్బులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు బ్యాంకుకు డబ్బలు వస్తున్నాయా లేదా తెలియడం లేదన్నారు. తాను చాలా రోజుల నుంచి వస్తున్నానని చెప్పారు. కానీ డబ్బులు మాత్రం దొరకడం లేదన్నారు.