'నావల్ల కావట్లేదు మా.. మిస్ యూ, అక్కా.. అమ్మ జాగ్రత్త'
చిత్తూరు: జిల్లా డీఈవో కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న డి.శ్రీకాంత్రెడ్డి (27) అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కార్యాలయానికి మూడు రోజులు లీవ్ పెట్టి సొంతూరు వెళ్లిన శ్రీకాంత్ రెడ్డి.. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆత్మహత్యకు ముందు అతను రాసిన సూసైడ్ నోట్.. హృదాయ విదారకంగా ఉంది. "డోంట్ క్రై మా.., సారీ మా.. మిస్ యూ మా.." అంటూ నోట్ లో పేర్కొన్నాడు. స్పష్టమైన కారణం చెప్పకుండా.. తన తలలో ఏదో దూరిందని అతను పేర్కొనడం గమనార్హం.
అసలేమైంది?:
కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని పెద్దపసుపుల గ్రామానికి చెందిన డి.వెంకటరెడ్డి పీటీఎం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. పల్లె వాతావరణంపై ఇష్టంతో గుంతా వారిపల్లె సమీపంలో 25గుంటల భూమిని కొనుగోలు చేసి సొంతింటిని నిర్మించుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు గతేడాది ఓ ప్రమాదంలో ఆయన మృతి చెందారు.
శ్రీకాంత్ రెడ్డికి ఉద్యోగం:
ఉపాధ్యాయుడిగా కొనసాగుతుండగానే మృతి చెందడంతో.. ఇంటర్ చదువుతున్న అతని కొడుకు డి.శ్రీకాంత్ రెడ్డికి చిత్తూరు డీఈవో కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం వచ్చింది. 6 నెలలుగా అక్కడి కార్యాలయంలో శ్రీకాంత్ విధులు నిర్వహిస్తున్నాడు.
అయితే ఉద్యోగంలో చేరినప్పటి నుంచి శ్రీకాంత్ రెడ్డి సంతోషంగా లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల పాటు సెలవు పెట్టి సొంతూరుకు వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
సూసైడ్ నోట్:
'సారీ మా.. నా తలలో ఏదో దూరింది.. నేను బతికుండి రోజూ చావలేను.. నా మెంటల్ కండీషన్ బాగోలేదు.. నన్ను క్షమించు మా నిన్ను బాధపెడుతున్నందుకు. నేను జాబ్లో చేరినప్పటి నుంచి హ్యాపీగా లేను. కొద్దిరోజులైతే అలవాటుపడతాననుకొన్నా. కానీ నావల్ల కావడం లేదు.'
'నాన్న ఉన్నప్పుడు నేను ఇలా లేను. నా మనసు ఈ జీవితానికి అలవాటు పడట్లేదు. మా నువ్వు హ్యాపీగా ఉండాలి. నువ్వు బాధపడకు. నా ఆత్మకు శాంతి ఉండదు. మా నువ్వు, నా ఫ్రెండ్స్ బాగుండాలి. డోంట్ క్రై మా.. సారీ మా.. మిస్ యూ మా.'
'లేఖలో తప్పులున్నా యి ఎందుకంటే తాగి ఉన్నాను క్షమించు మా.. సారీ ఫ్రెండ్స్ తాగడానికి కారణం చావడానికి ధైర్యం చాలలా.. సంధ్య అమ్మను బాగా చూసుకో. నా చావుతో ఎవరికి ఎటువంటి సంబంధం లేదు.. నేను నాన్న దగ్గర ఉంటా' అంటూ ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో పేర్కొన్నాడు.
స్నేహితులకు వాయిస్ మెసేజ్:
సూసైడ్ నోట్ రాయడంతో పాటు, ఆత్మహత్యకు ముందు శ్రీకాంత్ రెడ్డి స్నేహితులకూ వాయిస్ మెసేజ్ పంపించాడు. అందులో 'సారీ మా.. బై మా.. నేను వెళ్లిపోతున్నా..' అని చెప్పాడు. అనుమానం వచ్చిన స్నేహితులు శ్రీకాంత్ రెడ్డికి మొబైల్ కు ఫోన్ చేయగా.. అతను స్పందించలేదు.
తల్లి రమాదేవి ఆరోగ్యం బాగా లేకపోవడంతో శ్రీకాంత్ రెడ్డి అక్క సంధ్య ఆమెను తీసుకుని బెంగళూరు వెళ్లారు. దీంతో ఆత్మహత్య సమయంలో ఇంట్లో శ్రీకాంత్ ఒక్కడే ఉన్నాడు. మదనపల్లె నుంచి ఇద్దరు మిత్రులు గురువారం ఉదయం గుంతావారి పల్లెకు చేరుకుని.. శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అప్పటికే అతను ఉరివేసుకొని మృతి చెంది ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు.
మంచివాడు.. :
శ్రీకాంత్ రెడ్డి మంచి వ్యక్తి అని చిత్తూరు డీఈవో చెబుతున్నారు. ఎప్పుడూ ఎవరితో మాట్లాడేవాడు కాదని, 6 నెలలుగా అతన్ని గమనిస్తున్నానని అన్నారు. తల్లికి ఆరోగ్యం బాగాలేదని సోమవారం నుంచి బుధవారం వరకు సెలవు పెట్టాడని, ఆఫీసులో అతనికి వేధింపులు, ఇబ్బందులు ఉన్నట్లు ఎప్పుడూ తన దృష్టికి రాలేదని అన్నారు.