టిటిడిలో డిపాజిట్లు గోల్మాల్ వ్యవహారం... ఏం జరిగిందంటే
తిరుపతి:తిరుమల తిరుపతి దేవస్థానంలో డిపాజిట్ల గోల్మాల్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. టిటిడి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా శ్రీవారి నిధులను ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేయడం ప్రకంపనలు రేపుతోంది.
Recommended Video
ఇలా సుమారుగా వెయ్యి కోట్ల రూపాయల శ్రీవారి నిధులను రూల్స్ ను ధిక్కరించి ఇండస్ఇండ్ బ్యాంకులో డిపాజిట్లు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే ఆంధ్రాబ్యంకు కంటే ఎక్కువ వడ్డీ ఇస్తామని కోట్ చేసినా నిబంధనలను కాదని ఆ బ్యాంకులో టిటిడి 4 వేల కోట్లు డిపాజిట్ చేసినట్లు విజయ బ్యాంకు ఆరోపిస్తోంది. మరోవైపు "కొందరు" పెద్దల వత్తిడితోనే టిటిడి అధికారులు ఈ విధంగా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ డిపాజిట్ల కు సంబంధించిన ఒప్పందం మార్చి 20న జరగగా, బ్యాంకుల మధ్య ఉన్న పోటీ కారణంగా ఈ విషయం బైటకు వచ్చినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే...
ముందు టెండర్లు...ఆహ్వానించాలి
ఏడుకొండల స్వామి వెంకటేశ్వరునికి వివిధ కార్యక్రమాల ద్వారా అనగా హుండీ కానుకలు, ప్రసాదాల విక్రయం, గదుల కేటాయింపు, కళ్యాణకట్ట టెండర్ల ద్వారా వచ్చే నిధులను నిబంధనల ప్రకారం వివిధ జాతీయ, రాష్ట్ర బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంది. ఇందుకోసం ముందుగా డిపాజిట్ వివరాలు, వడ్డీ సమాచారం కోరుతూ బ్యాంకుల నుంచి టెండర్లను ఆహ్వానించాల్సి ఉంది.
బ్యాంకు ప్రతినిధుల...సమక్షంలోనే...
దీంతో దీనిపై స్పందించిన బ్యాంకులు తమ వివరాలను సీల్డ్ కవర్లలో టిటిడి ఆర్థిక శాఖ అధికారులకు పంపుతారు. ఆ తరువాత నిర్ణీత దినం బ్యాంకు అధికారులను అందరినీ పిలిపించి వారి అందరి సమక్షంలోనే టెండర్లకు సంబంధించిన సీల్డ్ కవర్లను ఓపెన్ చేయాలి. ఇందులో ఎవరైతే తమ డిపాజిట్కు ఎక్కువ వడ్డీరేటు ఇస్తారో వారికే ప్రాధాన్యత ఇవ్వాలి...ఇదీ నిబంధన.
తేడా ఎక్కడ...వచ్చిందంటే?...
ఆ ప్రకారం టిటిడి ఇప్పటివరకూ 10,580 కోట్ల రూపాయల డిపాజిట్లను ఎస్బిఐ, ఇండియన్ ఓవర్సిస్, విజయ, ఆంధ్రా, ఇండియన్, బ్యాంక్ ఆఫ్ బరోడాలలో డిపాజిట్ చేసిందని, వీటన్నింటిని నిబంధనల ప్రకారమే డిపాజిట్ చేశారని తెలిసింది. ఈ క్రమంలోనే 2015, మార్చిలో ఆంధ్రాబ్యాంక్లో 7.22శాతం వడ్డీతో 3వేల కోట్లను డిపాజిట్ చేయగా ఈ డిపాజిట్లకు 2018, మార్చి 1 నాటికి మూడేళ్లు పూర్తయ్యి వడ్డీ రూపంలో వెయ్యి కోట్లు వచ్చింది. ఇప్పుడు ఆ వెయ్యి కోట్ల నగదే పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వెయ్యి కోట్ల నగదును నిబంధనల ప్రకారం అదే బ్యాంకులోనో మరో జాతీయ బ్యాంకులోనో మళ్లీ ఈ నిబంధనలన్నీ పాటించి డిపాజిట్ చేయాల్సి ఉండగా...టిటిడి అధికారులు "కొందరి" వత్తిడికి తలొగ్గి ఇండస్ఇండ్ అనే ప్రైవేట్ బ్యాంక్లో డిపాజిట్ చేయడం జరిగింది.
నిబంధనల ఉల్లంఘన...సుస్పష్టం...
2009 పాలకమండలి నిబంధనల ప్రకారం టిటిడికి చెందిన నిధులు, నగలు ప్రైవేట్ బ్యాంకుల్లో గాని, సంస్థల్లో గాని డిపాజిట్ చేయకూడదని రూల్స్ స్పష్టంగా ఉన్నాయి. ఈ మేరకు బోర్డు నిర్ణయం కూడా అంతే క్లియర్ గా ఉంది. ఆ ప్రకారమే శ్రీవారికి చెందిన 18 టన్నుల బంగారాన్ని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేశారు. దీని ద్వారా వచ్చే వడ్డీ సైతం రెన్యువల్ అవుతూ వస్తోంది. అయితే అదేక్రమంలో ఆంధ్రాబ్యాంక్లో వచ్చిన వెయ్యి కోట్లను వడ్డీని కూడా అలాగే రెన్యువల్ చేయడమో లేక మళ్లీ డిపాజిట్ల ప్రక్రియ చేపట్టి జాతీయ బ్యాంకులోనే వేయకుండా నిబంధనలకు విరుద్దంగా ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేయడంపై అనుమానాలకు తావిచ్చింది.
టిటిడి ఈవో...వివరణ...
అయితే ఈ వివాదంపై తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్కుమార్ సింఘాల్ ఏమని వివరణ ఇచ్చారంటే తాము దేవాలయ నిధులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే చేసామే తప్ప నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని స్పష్టం చేశారు. మొత్తం నిధులలో 10 శాతం నిధులను ప్రైవేట్లో డిపాజిట్ చేయవచ్చనే నిబంధన టిటిడిలో ఉందని అన్నారు. అయితే ఈ నిబంధన 2009కు ముందు నిబంధన కాగా...ఆ తరువాత 2009 లో ఈ నిబంధనలను సంస్కరించి కొత్త నిబంధనలు అమలులోకి తేవడం...ఇప్పటివరకు ఆ నిబంధనలను అనుసరించే డిపాజిట్ల దాఖలు జరుగుతుండటం గమనార్హం. దీంతో కొందరు 'పెద్దల' కమిషన్ కోసమే ఇలా స్వామివారి నిధులను ప్రైవేట్ బ్యాంకు మళ్లించారన్నవిమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.