యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్న ఖైదీ: బీటెక్ విద్యార్ధిని బలవన్మరణం
విశాఖపట్నం: విశాఖలో గురువారం ఉదయం ఓ ఖైదీ ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే ఓ కేసులో నిందితుడిగా ఉన్న రిమాండ్ ఖైదీ శ్రీనివాసరెడ్డి జైల్లో తన బ్యారక్లో యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
బాలికపై లైంగిక వేధింపుల కేసులో శ్రీనివాసరెడ్డిని ఇటీవల అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు ముందు హాజరుపరిచారు. కేసు విచారణలో ఉన్నందున అతడికి న్యాయమూర్తి జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. రోజుల తరబడి జైల్లోనే ఉన్నా, తనకు బెయిల్ ఇప్పించేందుకు తన కుటుంబ సభ్యులు యత్నించక పోవడంతో ఆవేదనతో శ్రీనివాసరెడ్డి తీవ్ర మనస్తాపం చెందాడు.
దీంతో గురువారం ఉదయం జైలులో యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దీంతో వెంటనే స్పందించిన జైలు సిబ్బంది అతడిని కేజీహెచ్కి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. శ్రీనివాసరెడ్డి విశాఖలోని అరిలోవలోని డ్రైవర్స్ కాలనీకి చెందిన వాడని పోలీసులు తెలిపారు.
బీటెక్ విద్యార్థిని బలవన్మరణం
చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం అమ్మచెరువు మిట్ట గ్రామంలో బుధవారం ఉదయం ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన శివలక్ష్మి కూలి పనులు చేసుకుంటూ తన కుమార్తె సుమలత( 22) ను కురబలకోట సమీపంలోని అంగళ్లు ఎంఐటీ కళాశాలలో బీటెక్ చదివిస్తోంది.
ప్రస్తుతం బీటెక్ ఫైనలియర్లో ఉన్న సుమలత గురువారం ఉదయం తల్లి ఇంట్లో లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.