కడలూరు వద్ద తీరాన్ని తాకిన వాయుగుండం: కావలి వద్ద సముద్రం అల్లకల్లోలం
నెల్లూరు: తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లా కావలి సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు 50 మీటర్ల ముందుకు చొచ్చుకురావడంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో పడవలను ఓడ్డుకు తీసుకువస్తున్నారు. అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదని, ఇప్పటి వరకు ఎవరూ తమ గ్రామానికి రాలేదని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో ఇప్పటికే కుండపోత వర్షాలు వర్షాలు కురుస్తున్నాయి. దీని తీవ్రత దృష్ట్యా చెన్నై సహా తమిళనాడులోని 7 జిల్లాల్లో ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది.
కాగా, నైరుతి బంగాళాఖాతంలో బలపడిన తీవ్రవాయుగుండం సోమవారం మధ్యాహ్నం కడలూరు దగ్గర తీరాన్ని తాకింది. తీరం దాటేందుకు మరో రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో మోస్తరు నుంచి భారీవర్షాలు పడే అవకాశం ఉంది. నాగపట్నంలో 20 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, చెన్నై విమానాశ్రయంలో 17 సెం.మీ. వర్షపాతం నమోదు అయ్యింది.