ఉత్తరాంధ్రకు వానపోటు: బంగాళాఖాతంలో అల్పపీడనం
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రాంతంలో మూడు జిల్లాల్లో వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నంలోని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఈశాన్య దిశలో సుమారు మూడు కిలోమీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా అల్పపీడనంగా రూపుదిద్దుకుంటోందని అన్నారు. వచ్చే 36 గంటల్లో అది క్రమంగా వాయుగుండంగా మారవచ్చని, ఫలితంగా- విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం సహా ఒడిశా తీర ప్రాంత జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేశారు. క్రమంగా ఈ అల్పపీడనం ఈశాన్య బంగాళాఖాతం మీదుగా తూర్పు, మధ్య బంగాళాఖాతం ప్రాంతానికి విస్తరించే అవకాశం ఉందని తెలిపారు.
దక్షిణ కోస్తా సముద్రతీరం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
కాగా, వాయుగుండం తుఫానుగా మారుతుందా? లేదా? అనేది ఇప్పటికిప్పుడు అంచనా వేయలేమని అన్నారు. దీనికోసం కనీసం 36 గంటల సమయం అవసరం అవుతుందని అభిప్రాయపడ్డారు. వాయుగుండం బలపడటానికి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయని వెల్లడించారు. తుఫానుగా మారిన తరువాత దాని కదలికలను పసిగట్టగలమని చెప్పారు.
రాష్ట్రంలో ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి. రాయలసీమలోని నాలుగు జిల్లాలు తప్ప.. మిగిలిన చోట్ల అంతా భారీ నుంచి అతి భారీ వర్షాలకు నమోదయ్యాయి. భారీ వర్షాలకు తోడు గోదావరికి వరద ప్రవాహం సంభవించడం వల్ల ఏజెన్సీ గ్రామాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముంపు గ్రామాల్లో ఏరియల్ సర్వే సైతం నిర్వహించారు. బాధితులకు పరిహారాన్ని ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాటిపై నిర్మించిన గొట్టా ప్రాజెక్టు, తోటపల్లి బ్యారేజీల నుంచి లక్షకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మరో 36 గంటల్లో మరోసారి భారీ వర్షాలకు కురిస్తే.. వాటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది.