రాజ్యసభలో సాయిరెడ్డి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చర్చ- టీడీపీ ఫిర్యాదుతో రికార్డుల్లో తొలగింపు..
ఏపీలో న్యాయవ్యవస్ధ నుంచి ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ నిన్న రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. నేరుగా కోర్టులను టార్గెట్ చేసేలా సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పార్లమెంటులో పార్టీలకతీతంగా ఎంపీలు దీనిపై చర్చించుకోవడం కనిపించింది. ఏపీలో ఏం జరుగుతుందో అన్న చర్చ కూడా వారి మధ్య సాగింది. చివరికి టీడీపీ ఎంపీ ఫిర్యాదుతో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ వాటిని రికార్డుల నుంచి తొలగించారు. అయితే ఏపీలో న్యాయవ్యవస్ధకూ, ప్రభుత్వానికి మధ్య ఏ స్ధాయిలో వార్ జరుగుతుందో అన్న చర్చకు ఇవి తావిచ్చాయి.
కీలక సమయంలో మోదీకి జగన్ అండ - వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు - బీజేపీ మిత్రులే షాకిచ్చిన వేళ
విజయసాయి వ్యాఖ్యలతో కలకలం..
ఏపీలో అమరావతి భూముల దర్యాప్తు జరగకుండా, వాటిపై మీడియా కవరేజ్ లేకుండా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై నిన్న రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనూహ్యంగా ప్రస్తావించారు. ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ కరోనా నియంత్రణపై చేసిన ప్రసంగంపై అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం లభించింది. ఈ సమయంలో తన వంతు రాగానే ప్రసంగం ప్రారంభించిన సాయిరెడ్డి మెల్లగా ఏపీ వ్యవహారాలపైకి వెళ్లిపోయారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ పదే పదే వారిస్తున్నా వినకుండా న్యాయవ్యవస్ధపై పరుషమైన వ్యాఖ్యలతో తన ప్రసంగం కొనసాగించారు. దీంతో సభ్యులకు ఏం జరుగుతుందో కాసేపు ఆర్ధం కాలేదు. చివరికి డిప్యూటీ ఛైర్మన్ అభ్యంతరాల మధ్య సాయిరెడ్డి తన ప్రసంగం ముగించారు.
సాయిరెడ్డి వ్యాఖ్యలపై చర్చ...
న్యాయవ్యవస్ధకు ఉన్న గౌరవం దృష్ట్యా చట్ట సభల్లో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, చట్ట సభల సభ్యులు సంయమనం పాటిస్తుంటారు. ముఖ్యంగా కోర్టు తీర్పులపై మాట్లాడేందుకు ఇష్టపడరు. కానీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం న్యాయవ్యవస్ధపై చట్ట సభల సాక్షిగా విమర్శలకు దిగారు. దీన్ని లైవ్లో చూస్తున్న వారితో పాటు పార్లమెంటులో ఉన్న ఎంపీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాయిరెడ్డి తీరుపై పలు రాజకీయ పార్టీల నేతలు చర్చించుకోవడం కనిపించింది. చివరికి సాయిరెడ్డి ప్రసంగం ముగిసిన తర్వాత కూడా బయట వైసీపీ ఎంపీలు సీబీఐ దర్యాప్తు కోసం నిరసనకు దిగడంతో ఏపీలో ఏం జరుగుతుందో అన్న చర్చ సాగుతోంది. అయితే కోర్టు తీర్పులను అడ్డుపెట్టుకుని న్యాయవ్యవస్ధ వల్ల ఏపీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి.
సాయిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ ఫిర్యాదు...
న్యాయవ్యవస్ధపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వయంగా లాయర్ అయిన టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ సాయిరెడ్డి వ్యాఖ్యలపై డిప్యూటీ ఛైర్మన్కు ఫిర్యాదు చేశారు. న్యాయవ్యవస్ధను కించపరిచేలా ఉన్న సాయిరెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఆయన్ను కోరారు. దీంతో వాటిని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ ప్రకటించారు. తాను వారిస్తున్నా వినకుండా న్యాయవ్యవస్ధపై సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులు తమ ప్రసంగాల్లో సంయమనం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. చర్చకు సంబంధం లేని అంశాలను మధ్యలో తీసుకురావడం సరికాదన్నారు.
Recommended Video
బెయిల్పై ఉంటూ న్యాయవ్యవస్ధపై విమర్శలా..
విజయసాయిరెడ్డి కోర్టులపై రాజ్యసభలో చేసిన విమర్శలపై రాష్ట్రంలోనూ టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. బెయిల్పై ఉంటూ న్యాయవ్యవస్ధను విమర్శిస్తారా అంటూ విపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలతో మాట్లాడిన చంద్రబాబు.. కండిషనల్ బెయిల్పై ఉంటూ న్యాయవ్యవస్ధపై విమర్శలు చేయడం సాయిరెడ్ దివాలాకోరుతనమని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో చనిపోయిన ఎంపీలకు సంతాప తీర్మానం ప్రవేశపెడుతుంటే వైసీపీ ఎంపీలు బయటికి వచ్చి సీబీఐ దర్యాప్తు కోసం నిరరసనలకు దిగడం దారుణమని చంద్రబాబు తెలిపారు. కరోనా నియంత్రణలో వైసీపీ వైఫల్యం వల్లే ఆ పార్టీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ప్రాణాలు కోల్పోయారని చంద్రబాబు ఆరోపించారు.