షటిల్ కోర్టు ప్రారంభోత్సవంలో అపశ్రుతి...జారి పడ్డ డిప్యూటీ సీఎం చిన రాజప్ప
తూర్పుగోదావరి:కాకినాడలోని వివేకానంద పార్కులో షటిల్ కోర్టు ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. షటిల్ కోర్టు ప్రారంభం అనంతరం ఆట ఆడుతున్న డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప కాలు జారి పడటంతో ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు.
వెంటనే తేరుకొని అందరూ ఒక్క ఉదుటున ఆయనను పైకి లేవదీశారు. అయితే చిన రాజప్పకు ఎలాంటి గాయం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే అలా జారిపడటాన్ని స్పోర్టివ్ గా తీసుకొన్న చినరాజప్ప...ఆ తరువాత యథావిధిగా ఆ కార్యక్రమాన్ని కొనసాగించడంతో పాటు మిగిలిన కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. డిప్యూటీ సిఎం చిన రాజప్ప ఇటీవలికాలంలో ఇదే ప్రాంతంలో ఇలా ప్రమాదం నుంచి సురక్షితంగా బైటపడటం ఇది రెండోసారి.
కాకినాడ వివేకానంద పార్క్ లో రాజా ట్యాంక్ ఆవరణలో షటిల్ కోర్టును ప్రారంభించిన డిప్యూటీ సిఎం చినరాజప్ప...అనంతరం షటిల్ ఆడే క్రమంలో కాలు జారి కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, అక్కడే ఉన్న టీడీపీ నేతలు ఒక్క ఉదుటన ఆయనను పైకి లేవదీశారు. అనంతరం చినరాజప్ప తనకేమీ కాలేదని...ఒళ్లు విదుల్చుకుంటూ...ఛలోక్తులు విసురుతూ ఘటనా స్థలంలో నవ్వులు పువ్వులు పూయించారు. తనకు ఎలాంటి దెబ్బలు తగలలేదంటూ...ఇలాంటివి తనను ఏమీ చేయలేవంటూనే మిగకా కార్యక్రమాల్లో పాల్గొని పూర్తిచేశారు.
హోం మంత్రి చినరాజప్ప గతంలో ఇక్కడే సంజీవిని ఆస్పత్రిలోని ఒక రోగిని పరామర్శించేందుకు విచ్చేసిన సందర్భంగా ఆస్పత్రిలోని లిఫ్ట్ అదుపు తప్పడంతో ప్రమాదం ముప్పు ఎదుర్కోగా...ఆ ప్రమాదం నుంచి క్షేమంగా తప్పించుకున్నారు. తిరిగి అదే ఆస్పత్రి ఎదురుగా ఉన్న వివేకానంద పార్కు ప్రారంభోత్సవంలో మళ్లీ అపశ్రుతి దొర్లగా ఈ ప్రమాదం నుంచి కూడా ఆయన సురక్షితంగా బైటపడ్డారు.
అయితే గతంలోనూ ఇదే ప్రాంతంలో ఆయన ప్రమాదం ముప్పు ఎదుర్కోవడం, అయితే ఇలా రెండు సార్లు ఆయన సురక్షితంగా ప్రమాదం నుంచి బైటపడటం స్థానికులు విశేషంగా చెప్పుకుంటున్నారు.