టీడీపీ డ్యామేజ్ కంట్రోల్- అయ్యన్నపై చర్యలు తీసుకోక తప్పదా..?!
అనకాపల్లి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం తగ్గట్లేదు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ఎదురుదాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యల తీవ్రత- అటు తెలుగుదేశం పార్టీకి కూడా నష్టం కలిగించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
ఘాటు వ్యాఖ్యలతో చెలరేగిన ఉమాశంకర్ గణేష్..
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసన సభ్యుడు పెట్ల ఉమాశంకర్ గణేష్ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు, నారా లోకేష్, అయ్యన్నపాత్రుడిని సైకోలతో పోల్చారు. అయ్యన్న పాత్రుడికి మైక్ దొరికితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. ముఖ్యమంత్రి, ఇతర పార్టీ నాయకులపై విమర్శలకు దిగితే తాము అంతకంటే రెట్టింపుగా మాట్లాడుతామని హెచ్చరించారు.
ప్రజల ఛీత్కారం..
తాజాగా ఎక్సైజ్ మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి స్పందించారు. అయ్యన్న పాత్రుడిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి వైఖరినీ ఆయన తప్పుపట్టారు. అయ్యన్న పాత్రుడిపై చర్యలు తీసుకోవాలంటూ నారాయణ స్వామి డిమాండ్ చేశారు. అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు.. ఇలా టీడీపీ మొత్తాన్నీ ప్రజలు ఛీత్కరించారని చెప్పారు.
హోం మినిస్టర్ అవుతావా?
2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని, తాను హోం మంత్రిని అవుతానంటూ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను నారాయణ స్వామి తప్పుపట్టారు. టీడీపీ ఇక జన్మలో అధికారంలోకి రాదని, హోం మంత్రి కావాలనే అయ్యన్నపాత్రుడి ఆశలు నీరుగారుతాయని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి, అయ్యన్నపాత్రుడు హోం మినిస్టర్ కావడం జరిగే పని కాదని తేల్చి చెప్పారు. అధికారంలోకి ఎవరు రావాలనేది ప్రజలు నిర్ణయిస్తారే తప్ప- ఎవరికి వారు కాదని అన్నారు.
అయ్యన్న భూకబ్జాదారుడు..
అయ్యన్నపాత్రుడు ఓ పెద్ద భూకబ్జాదారుడని నారాయణ స్వామి విమర్శించారు. ఒక్క అయ్యన్నమాత్రమే కాదని, ఆయన పార్టీ నాయకులందరిదీ అదే తీరు అని మండిపడ్డారు. ప్రజలు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీని అధికారంలోకి రానివ్వరని చెప్పారు. అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. అయ్యన్న తన వ్యాఖ్యలతో టీడీపీకి నష్టం కలిగించాడని అన్నారు.