జగన్ కు గంటెలతో వాతలు పెట్టండి : కేఈ, హుందాతనం నేర్చుకో జగన్.. : ఆనం
విజయవాడ : ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం ముదురుతోంది. వైసీపీ అధినేత జగన్ చంద్రబాబుపై విరుచుకుపడ్డం, ప్రతిఘటించే క్రమంలో టీడీపీ నేతలు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో వాడి-వేడి మాటల నడుమ ఇరు పార్టీల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది.
ఈ నేపథ్యంలోనే రైతు భరోసా యాత్ర ముగింపు సందర్భంగా అనంతపురంలో జగన్ చేసిన వ్యాఖ్యలను గట్టిగానే తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నేతలు. 'చంద్రబాబుకి చెప్పులతో పాటు చీపుర్లు కూడా చూపించాలంటూ..' జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణలు భగ్గుమంటుండగా, తాజాగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి జగన్ వ్యాఖ్యలపై తీవ్రంగా ఫైర్ అయ్యారు.
కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న కేఈ, జగన్ కి గట్టి కౌంటరే ఇచ్చారు. చంద్రబాబుకు చెప్పులు, చీపుర్లు చూపించాలని చెప్పడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన, ఇంకెప్పుడూ జగన్ నోటి వెంట అలాంటి మాటలు రాకుండా ఉండాలంటే, 'మహిళలంతా గంటెలతో జగన్ కి వాతలు పెట్టాలని' సూచించారు.
నవనిర్మాణ దీక్షలో భాగంగా మాట్లాడిన కేఈ.. ఓవైపు విభజన కష్థాలను ఎదుర్కుంటూనే సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్దికి పాటు పడుతుంటే, ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు.
హుందాతనం నేర్చుకో జగన్.. : ఆనం
హైదరాబాద్ : ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలిని తప్పుబట్టారు టీడీపీ నేత ఆనం రాంనారాయణ రెడ్డి. సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆనం.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను జీర్ణించుకోలేకనే జగన్ చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారన్నారు.
ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి రాష్ట్రాభివృద్దికి సహకరించాల్సింది పోయి, రాష్ట్ర పునర్నిర్మాణానికి అడ్డు తగిలేలా వ్యవహరించడం సబబు కాదన్నారు. నవ నిర్మాణం ఏ ఒక్కరి ప్రయోజనాలకో సంబంధించింది కాదని రాష్ట్ర పునర్నిర్మాణాన్ని కాంక్షించే నవ నిర్మాణ దీక్ష సంకల్పానికి చంద్రబాబు పూనుకున్నారని చెప్పారు.
ప్రజాతీర్పును కనీసం గౌరవించలేని జగన్ లాంటి వ్యక్తికి ప్రతిపక్ష హోదాలో ఉండే అర్హత లేదన్న రాంనారాయణ రెడ్డి, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారిని చులకన చేసి మాట్లాడ్డమంటే రాష్ట్ర ప్రజలను అవమానించినట్టేనని చెప్పుకొచ్చారు.
సభ్యత సంస్కారాలు మరిచిపోయి ఇష్టం వచ్చినట్టుగా దిగజారుడు వ్యాఖ్యలు చేయొద్దని జగన్ కి సూచించిన ఆయన, జగన్ హుందాగా వ్యవహరించడం మంచిదని సలహా ఇచ్చారు.