ఓటమి కృంగదీసింది... జగన్ పాలనలో రౌడీ రాజ్యం నడుస్తోంది .. మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ మూర్తి
ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైన తర్వాత కనుమరుగైన కీలక నాయకులు ఇపుడిప్పుడే బయటకు వస్తున్నారు. గత టీడీపీ హయాంలో డిప్యూటీ సీఎంగా ఒక వెలుగు వెలిగిన కేఈ కృష్ణమూర్తి తాజాగా నోరు విప్పారు. గత ఎన్నికల్లో తన తనయుడు కేఈ శ్యాంబాబు ఓడిపోవడం తనను కుంగదీసిందని కన్నీళ్ళ పర్యంతం అయ్యారు . ఇక జగన్ సర్కార్ పై విమర్శలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి .
ఓటమి ఆవేదనతో కన్నీరు పెట్టుకున్న మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
టీడీపీ పత్తికొండ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన కేఈ కృష్ణ మూర్తి చాలా ఉద్వేగంగా మాట్లాడారు.నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎంతగానో కృషి చేశానని, అయినప్పటికీ.. భారీ తేడాతో ఓడిపోవడం తనను ఆవేదనకు గురి చేసిందని ఆయన పేర్కొన్నారు. అసలు తాను ప్రజలకు చేసిన లోటు ఏమిటో అర్ధం కావటం లేదన్న కేఈ కృష్ణ మూర్తి పత్తికొండ నియోజకవర్గంలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించానని తెలిపారు. అయినా తన కుమారుడు ఓటమి పాలయ్యాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. గత ఎన్నికల ఓటమి తనను ఎంతగానో కృంగదీసిందని ఆయన పేర్కొన్నారు. ఇక కార్యకర్తలతో మాట్లాడుతూనే ఆయన కన్నీరు పెట్టుకున్నారు
ఇప్పటి నుండే వచ్చే ఎన్నికల కోసం పని చెయ్యాలని సూచించిన కేఈ కృష్ణ మూర్తి
ఇక ప్రజా నిర్ణయం ఎలా ఉంటే అలా దానిని స్వీకరిస్తానని చెప్పిన ఆయన ప్రజలు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తానని చెప్పారు మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ మూర్తి . ఇక వచ్చే ఎన్నికల లక్ష్యంగా పని చేద్దామని ఆయన కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. అధికార పార్టీ ఇబ్బందులు పెట్టినా భయపడొద్దు అని ఆయన తెలిపారు. కార్యకర్తలకు అండగా తానుంటానని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడి గెలుపు కోసం ఇప్పటి నుంచే కృషి చెయ్యాలని, ప్రజా సమస్యల కోసం పోరాటం చెయ్యాలని , అందుకు సహకరించాలని ఆయన కార్యకర్తలను కోరారు. వైసీపీ నేతలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా... కార్యకర్తలు పార్టీని వీడకుండా ఉండటం అభినందనీయమన్నారు కేఈ కృష్ణమూర్తి. ఇక కార్యకర్తలకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చి ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని సూచించారు. .
రీ కౌంటింగ్ పెట్టి ఉంటే టీడీపీ గెలిచేదన్న కేఈ కృష్ణమూర్తి
ఇక వైసీపీ పాలనపై కూడా అయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో అరాచకం రాజ్యమేలుతుందని ఆయన పేర్కొన్నారు.జగన్ పాలనలో రౌడీ రాజ్యం నడుస్తోందని... టీడీపీ నేతలే టార్గెట్ గా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ పై విమర్శలు చేశారు. జగన్ విధానాల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోతాయేమోననే భయం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు . ఇక గత ఎన్నికలపై సంచలన ఆరోపణలు చేశారు. రీ కౌంటింగ్ పెట్టి ఉంటే టీడీపీ గెలిచి ఉండేదని ఆయన పేర్కొన్నారు. ఇక జగన్ పాలనలో దాడులు , కక్ష సాధింపు చర్యలు తప్ప పారదర్శకత లేదని ఆయన విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో జగన్ కోసం తెలంగాణా సీఎం కేసీఆర్ డబ్బులు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ఇక టీడీపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు చంద్రబాబు పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారని ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆయన ఈ సందర్భంగా పార్టీ నేతలకు సూచించారు.