జగన్ కాళ్ల దగ్గర లక్ష్మీ పార్వతి...అప్పుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించలేదా?: కేఈ కృష్ణమూర్తి బహిరంగ లేఖ
కర్నూలు:కాంగ్రెస్ తో టిడిపి కలిస్తే ఉరి వేసుకుంటానన్న డిప్యూటీ సిఎం కెఈ కృష్ణమూర్తి ఆ విషయమై తొలిసారిగా తన స్పందన తెలిపారు. రాహుల్-చంద్రబాబు భేటీని సమర్థించారు.
కాంగ్రెస్-టిడిపిల పొత్తును పూర్తిగా సమర్థిస్తూ...దీనిపై విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ కెఈ కృష్ణమూర్తి ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన తన లేఖలో కోరారు. అంతేకాకుండా లేఖలో ప్రతిపక్షాలపై పలు ప్రశ్నలను సంధించారు.
డిప్యూటీ సిఎం కెఈ కృష్ణమూర్తి ఇటీవల విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ తో టిడిపి పొత్తు పెట్టుకుంటే...అనే ప్రశ్నకు స్పందిస్తూ...అలా ఎప్పటికీ జరగదని...ఒకవేళ అలా జరిగితే తాను ఉరి వేసుకుంటానని ఆవేశంగా మాట్లాడారు. మరోవైపు మరో సీనియర్ మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా కాంగ్రెస్-టిడిపి పొత్తుపై ఇదేరకంగా స్పందించారు. కాంగ్రెస్ తో టిడిపి పొత్తు పెట్టుకుంటే అంతకంటే దుర్మార్గం ఉండదని...అలా చేస్తే ప్రజలు టిడిపి నేతలను తరిమి తరిమి కొడతారంటూ వ్యాఖ్యానించారు.
అయితే వీరు ఈ వ్యాఖ్యలు చేసిన అనతికాలంలోనే కాంగ్రెస్ తో పొత్తు దిశగా టిడిపి అధినేత చంద్రబాబు చకచకా పావులు కదపడం, అదే క్రమంలో ఢిల్లీ వెళ్లి ఏకంగా రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశం కావడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తో పొత్తు ఏర్పడితే తాను ఉరేసుకుంటానన్న డిప్యూటీ సిఎం కెఈ కృష్ణమూర్తి ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.
అయితే రాహుల్-చంద్రబాబు భేటీ జరిగి రోజులు గడుస్తున్నా డిప్యూటీ సిఎం కెఈ ఏ ప్రకటనా చేయకపోవడంపై చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలోనే ఆదివారం కాంగ్రెస్-టిడిపి పొత్తుపై డిప్యూటీ సిఎం కెఈ కృష్ణమూర్తి తెలుగు ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన టిడిపి-కాంగ్రెస్ పొత్తుపై విమర్శలు చేస్తున్న విపక్షాలపై ప్రశ్నల వర్షం కురిపించారు.
''రాహుల్ని చంద్రబాబు కలిస్తే తప్పేంటి? విభజన చట్టంలోని హామీలను విస్మరించి మనల్ని మోసం చేసిన వారిపై తిరగబడి మన హక్కులను కాపాడుకోవాలని అనుకోవడం తప్పా?...ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి కాంగ్రెస్లో చేరి మంత్రి పదవి తీసుకున్నప్పుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించలేదా?...అనంతరం ఆమె పార్టీ మారి బీజేపీలో చేరినపుడు బాధపడలేదా?"...అని కెఈ కృష్ణమార్తి ప్రశ్నించారు.
అలాగే లక్ష్మీ పార్వతి జగన్ కాళ్ల దగ్గర కూర్చుంటే ఎన్టీఆర్ ఆత్మ బాధపడలేదా?...ఒక్క టీడీపీ మాత్రం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందా?... అని లేఖలో కేఈ నిలదీశారు. బీజేపీ చేతిలో వైసీపీ కీలుబొమ్మగా మారిందని కెఈ దుయ్యబట్టారు. రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రజలు అర్థం చేసుకోవాలని డిప్యూటీ సిఎం కేఈ కృష్ణమూర్తి తన లేఖలో ప్రజలను కోరారు.