రాజకీయాలనుండి తప్పుకోమంటారా ? సొంత పార్టీ నేతల తీరుతో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆవేదన
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏ మంత్రి అనుభవించని ఇబ్బందులు డిప్యూటీ సీఎం నారాయణస్వామి అనుభవిస్తున్నారు. అంతేకాదు ఏకంగా సొంత పార్టీ నేతల వద్ద రాజకీయాల నుంచి తప్పుకోమంటారా ఏంటి అంటూ లబోదిబోమంటున్నారు. తనపై వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నా అని తేల్చి చెబుతున్నారు. అసలు ఇంటికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఏ విషయంలో ఈ విధంగా చెబుతున్నారు అంటే..
ఫోటోలు: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం
చిత్తూరు జిల్లాలో గ్రూపు రాజకీయాలతో ఇబ్బంది పడుతున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
చిత్తూరు జిల్లాలో గ్రూపు రాజకీయాల నేపథ్యంలో తాను ఇబ్బంది పడుతున్నట్లుగా చెబుతున్నారు నారాయణ స్వామి. ఇదే విషయాన్ని సొంత పార్టీ నేతల ముందే చెప్పారు . గ్రామం నుంచి కొందర్ని తరిమివేయాలంటే ఎలా? ఇలా ఎక్కడైనా చట్టం ఉందా ? అంటూ ప్రతిపక్ష పార్టీ నేతల విషయంలో, అధికార పార్టీ నేతల ఒత్తిడిని ఆయన ప్రశ్నించారు. మీరు వద్దంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. మీ ఇష్టం చెప్పండి అంటూ సొంత పార్టీ నేతలతో డిప్యూటీ సీఎం నారాయణస్వామి వాపోయారు అంటే ఆయనకు ఎటువంటి ఇబ్బంది కర పరిస్థితులు ఎదురవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇప్పించలేదని వైసీపీ నేతల అసహనం
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం లోని కొన్ని గ్రామాలలో ఏటా ఆనవాయితీగా జల్లికట్టు నిర్వహించేవారు. అయితే ఈసారి జల్లికట్టు నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. ఈ నేపథ్యంలో మంత్రి ముందు వైసీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలా అయితే కష్టమే అంటూ మంత్రి ముందు గట్టిగా మాట్లాడారు. దీంతో సొంత పార్టీ నేతలతో మాట్లాడిన నారాయణస్వామి తాను అందరిలా రాజకీయాలు చేయడం లేదని, పద్ధతులను పాటిస్తున్నానని పేర్కొన్నారు.
గ్రామం నుండి కొందరిని తరిమెయ్యాలంటే ఎలా ?తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం
అంతేకాదు పరోక్షంగా ప్రతిపక్షాల వారిపై కక్షసాధింపు చర్యలు తీసుకోవాలంటూ తనపై వస్తున్న ఒత్తిడి పై కూడా ప్రస్తావించిన ఆయన గ్రామం నుంచి కొందర్ని తరిమేయాలి అంటే ఎలా అంటూ ప్రశ్నించారు.జల్లికట్టు పైన కూడా తానేమీ చేయలేకపోయాను అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ఎస్పీతో మాట్లాడినప్పటికీ అనుమతి ఇవ్వలేదని, ఇతర ప్రాంతాల్లో అనుమతి ఇచ్చారని చెప్పినప్పటికీ తమిళనాడులో నిర్వహిస్తున్నారు అంటూ గుర్తు చేసినప్పటికీ ఎస్పీ ఒప్పుకోలేదని దానికి తానేమీ చేయలేనని వెల్లడించారు.
తాను చెప్పదలచుకుంది కుండ బద్దలు కొట్టిన నారాయణ స్వామి
మంత్రి అసహనం వ్యక్తం చేసిన తీరు చూస్తే ఆయనకు ఎంత ఒత్తిడి ఉందో ఇట్టే అర్థమవుతుంది. మంత్రి సమాధానం వైసీపీ శ్రేణులను నిరాశ పరిచినా , ఆయన అసహనం వ్యక్తం చేసిన తీరు వైసీపీ శ్రేణులను ఆలోచింపజేసేలా చేసింది . ఏది ఏమైనా తాను చెప్పదలుచుకున్నది కుండబద్దలు కొట్టి మరీ వెళ్ళిపోయారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.