'మీ రెడ్లు అందరూ ఇలాగే మాట్లాడతారా ఏంటి?'
''మీ రెడ్లు అందరూ ఇలాగే మాట్లాడతారా ఏంటి? చూస్తుంటే మిమ్మల్ని ఎవరో ఉసిగొల్పి పంపినట్లున్నారు.. అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు'' అంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నారాయణస్వామి చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం ఉగ్రాణం పల్లెలో పర్యటించారు.
ఈ సందర్భంగా పలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చేందుకు రిటైర్డ్ ఎంఈవో, న్యాయవాది మోహన్ రామిరెడ్డి ప్రయత్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన నారాయణస్వామి పైవిధంగా వ్యాఖ్యానించారు.
విద్యుత్తు ఉప కేంద్రంలో ఏఈ, సిబ్బంది కొరత ఉందని, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని, మీరు వాటిని పట్టించుకొని పరిష్కరించాలంటూ కోరారు. దీనిపై డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ''మీరట్లా మాట్లాడొద్దు.. రెడ్లు అందరూ ఇలాగే మాట్లాడతారా? ఏమిటి?'' అంటూ మండిపడ్డారు. దీంతో ఈ విషయమై ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. వివాదం పెద్దదవుతుండటంతో ఎస్ఐ అనిల్ కుమార్ జోక్యం చేసుకొని మోహన్ రామిరెడ్డిని అక్కడి నుంచి తీసుకువెళ్లారు.
ఆ సమయంలో ఎస్ ఐకి, రామిరెడ్డి కూడా వాగ్వాదం జరిగింది. ఈ వ్యవహారంపై నారాయణస్వామిపై, ఎస్ ఐపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదును తీసుకునేందుకు సిబ్బంది అంగీకరించలేదు. వారిద్దరూ తనను అనవసరంగా దూషించారని, మీరు కేసు నమోదు చేయకపోయినా ఈ విషయాన్ని తాను కోర్టులోనే తేల్చుకుంటానని మోహన్ రామిరెడ్డి హెచ్చరించారు.