వైసీపీలో చేరినా.. తోటత్రిమూర్తులు నాకు శత్రువే: ఏపీ డిప్యూటీ సీఎం.. పార్టీలో దుమారం
డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. తూర్పుగోదావరి జిల్లా టీడీపీ కీలకనేత, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన పార్టీలో చేరి పట్టుమని పది రోజులు గడవక ముందే డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ పాత గొడవలను మర్చి పోయేది లేదు అన్నట్టు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
కోడెల ఆత్మహత్యపై గవర్నర్ తో రేపు తెలుగు తమ్ముళ్ళ భేటీ .. విచారణ చెయ్యాలని కోరనున్న టీడీపీ
తోట త్రిమూర్తులు గురించి డిప్యూటీ సీఎం కాన్వాయ్ అడ్డుకున్న దళిత సంఘాల నేతలు
ఇక అసలు విషయానికి వస్తే రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ పర్యటించారు. ఇక డిప్యూటీ సీఎం కాన్వాయ్ ను అడ్డుకున్న దళిత సంఘాల నేతలు గతంలో జిల్లాలో జరిగిన వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైసీపీలో చేరినంతమాత్రాన తోట త్రిమూర్తులు ను వదిలి పెడితే ఊరుకునేది లేదని దళిత సంఘం నేతలు తేల్చి చెప్పారు.
వెంకటాయపాలెం శిరోముండనం కేసులో ప్రభుత్వం బాధితుల పక్షమే అన్న డిప్యూటీ సీఎం
ఇక ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్ర బోస్ మాట్లాడుతూ వెంకటాయపాలెం శిరోముండనం కేసులో ప్రభుత్వం బాధితులకు సహకారం అందిస్తుందని, త్రిమూర్తులు తమ పార్టీలో చేరినప్పటికీ తప్పు చేసిన వారిని విడిచిపెట్టేది లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తోట త్రిమూర్తులు ఎప్పుడూ తనకు శత్రువే అని పేర్కొన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ వెంకటాయపాలెం శిరోముండనం కేసులో ప్రభుత్వం దళితుల పక్షాన నిలుస్తుందని హామీ ఇచ్చారు.
తోట ఎప్పటికీ శత్రువే .. అవసరం అయితే ధర్నా చేస్తా అన్న పిల్లి సుభాష్ చంద్రబోస్
తోట త్రిమూర్తులు నిన్న, ఈరోజు, రేపు కూడా నాకు శత్రువే అని సంచలన వ్యాఖ్యలు చేసిన సుభాష్ చంద్రబోస్ అవసరమైతే దళితులతో కలిసి రోడ్లపై ధర్నా చేసేందుకు అయినా తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు ఈ కేసు విషయంలో తేడా జరగకుండా దళితులను తీసుకుని వెళ్తానని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీకి మొదటినుండి మద్దతుగా ఉన్న దళితులకు పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.
వైసీపీ లో డిప్యూటీ సీఎం వ్యాఖ్యల కలకలం ... తోట ఎలా స్పందిస్తారో ?
పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో కలకలం రేపాయి. పార్టీ నేతల్లో తోట త్రిమూర్తులు చేరికపై ఉన్న అసహనం బయటకు వచ్చింది. మరి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యలపై తోట త్రిమూర్తులు ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాలి. పార్టీ మారినప్పటికీ, ఒకే పార్టీలో ఉన్నప్పటికీ నేతల మధ్య విభేదాలు సమసిపోలేదు అన్న విషయం డిప్యూటీ సీఎం తాజా వ్యాఖ్యలతో తేటతెల్లమవుతుంది.ఇది ముందు ముందు ఎలాంటి పరిణామాలకు కారణం అవుతుందో వేచి చూడాలి .