కిడ్నాప్, నిర్బంధం: డిప్యూటీ మేయర్ అరెస్టు
వివరాలు ఇలా ఉన్నాయి - ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం రెడ్డిపాలేనికి చెందిన సింగంరెడ్డి రామకోటిరెడ్డి హైదరాబాద్లో ఒక ప్రైవేటు కంపెనీలో ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్టక్చర్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అతనికి చింతలపూడికి చెందిన కోసిన రవిప్రసాద్ స్నేహితుడు. అతని ద్వారా పలువురిని పరిచయం చేసుకుని రైల్వేశాఖ, అంగన్వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి సుమారు రూ.20 లక్షలు వసూలు చేశాడు.
వారిలో ఇద్దరికి ఉద్యోగాలు కూడా ఇప్పించాడు. మిగిలినవారికి ఉద్యోగాలు రాకపోవటంతో ఈవిషయంపై రామకోటిరెడ్డిని పలుమార్లు రవిప్రసాద్ ప్రశ్నిస్తూ వచ్చాడు. అతను కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో రవిప్రసాద్ ఏలూరులో ఉన్న మోర్త రామకృష్ణ తన బంధువు ద్వారా రామకోటిరెడ్డికి ఫోన్ చేయించి ఈనెల 4వ తేదీన ఏలూరు పిలిపించారు. అనంతరం రామకోటిరెడ్డిని ఏలూరు కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం సమక్షంలో వసూలు చేసిన డబ్బుల విషయమై ప్రశ్నించారు.
రామకోటిరెడ్డి నాలుగు లక్షల రూపాయలను రవిప్రసాద్కు చెల్లించాడు. మిగిలిన సొమ్ము హైదరాబాద్లో ఉన్న తన సోదరుడు వద్ద ఉందని చెప్పటంతో పంపారు. హైదరాబాద్ వెళ్లిన అతని ఎటువంటి సొమ్ము తీసుకురాకపోవటంతో మర్నాడు ఏలూరులో ఒక ప్రజాప్రతినిధి వద్దకు ఆతన్ని పిలిపించి మరోసారి ప్రశ్నించారు. వారంరోజుల్లో సొమ్ము చెల్లించాలని ఆ ప్రజాప్రతినిధి చెప్పి పంపించివేశారు. ఆతర్వాత నుంచి రెడ్డిని ఎనిమిది మంది వ్యక్తులు నిర్బంధించి ఏలూరు శివారుప్రాంతంలో దౌర్జన్యానికి దిగారు.
ఆ తర్వాత పవరుపేటలోని ఒక ఇంటిలో వారంరోజులుగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. ఖమ్మంలోని అతని బంధువులు కిడ్నాప్ వ్యవహారం తెలుసుకుని అక్కడి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కొంతమంది పోలీసు అధికారులు ఏలూరు చేరుకుని జిల్లా ఎస్పీని కలుసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు స్ధానిక పోలీసు అధికారులు, ఖమ్మం నుంచి వచ్చిన అధికారులు కలిసి పవరుపేటలో రామకోటిరెడ్డిని నిర్బంధించిన ఇంటిపై దాడి చేసి అతన్ని బయటకు తీసుకువచ్చారు.
తీవ్ర గాయాలు పాలైన రామకోటిరెడ్డిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నంతోపాటు కోసన రవిప్రసాద్, నిమ్మల శ్రీనివాసరావు, యల్లమిల్లి ప్రసాదు, ఉండి ప్రభాకర్, కాకర్ల రాము, బోయిన రఘునాథరావు, రామకృష్ణను అరెస్టు చేశారు.