జెరూసలేం టూర్ ఎఫెక్ట్: వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. తీర ప్రాంతాల్లో ఉప్పునీటి శుద్ధి కేంద్రాలు?
అమరావతి: రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో ఉప్పునీటి శుద్ధి కేంద్రాన్ని నెలకొల్పే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉప్పునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయడానికి గల సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. సుమారు 1000 కిలోమీటర్లకు పైగా తీర ప్రాంతం ఉన్న రాష్ట్రంలో ఏ జిల్లాలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే అంశంపై ఓ తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలో దీన్ని నెలకొల్పే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. రాష్ట్రంలో మిగిలిన జిల్లాలతో పోల్చితే.. ప్రకాశంలో ఫ్లోరైడ్ ప్రభావం అధికం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కేంద్రాన్ని ప్రకాశం జిల్లాలో స్థాపించవచ్చని అంటున్నారు. జిల్లాలోని సముద్ర తీర ప్రాంత పట్టణం సింగరాయ కొండలో దీన్ని నెలకొల్పాలని వైఎస్ జగన్ యోచిస్తున్నారట.
జెరూసలేం టూర్ ఎఫెక్టేనా?
వైఎస్ జగన్ నాలుగు రోజుల పాటు జెరూసలేం పర్యటనకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. ఆ పర్యటన వ్యక్తిగతమే అయినప్పటికీ.. ఆయన ఇజ్రాయెల్ లో కొందరు రైతులతో సంభాషించారు. తక్కువ నీటి వనరులతో అధిక దిగుబడిని సాధించడానికి అవసరమైన మెళకువల గురించి తెలుసుకున్నారు. ఇజ్రాయెల్ లోని హదేరా ప్రాంతంలో గల హెచ్2ఐడీ ఉప్పునీటి శుద్ధి కేంద్రాన్ని సందర్శించారు. సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే ప్లాంట్ అది. దాని పనితీరుపై వైఎస్ జగన్ ఆరా తీశారు. శుద్ధి చేసిన సముద్రపు జలాలను రుచి చూశారు. ఈ ప్లాంట్ ను నెలకొల్పడానికి అయ్యే ఖర్చు, ఇతర సాంకేతిక వనరుల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. టెల్ అవీవ్ సమీపంలోని హదేరా ప్రాంతంలో ఉందీ కేంద్రం. ఉప్పునీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియపై ఆ ప్లాంట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ రఫీ షమీర్ వైఎస్ జగన్ కు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇదే తరహా ప్లాంట్ ను రాష్ట్రంలో నెలకొల్పాలనే ఆలోచనకు అక్కడే బీజం పడిందని అధికారులు చెబుతున్నారు.
ప్రకాశమే ఎందుకు?
మనదేశంలో ఫ్లోరైడ్ ప్రభావం అత్యధికంగా ఉన్న ప్రాంతం తెలంగాణలోని నల్లగొండ జిల్లా. ఆ తరువాతి స్థానం ప్రకాశం జిల్లాదే. ఈ జిల్లాలో సుమారు 82 శాతం మండలాల్లో ఫ్లోరైడ్ వ్యాపించింది. భూగర్భ జలాలన్నీ ఫ్లోరైడ్ తో కలుషితం అయ్యాయి. జిల్లాలో మొత్తం 56 మండలాలు ఉండగా.. 46 ఫ్లోరైడ్ చోట్ల ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలుగా మారాయి. జిల్లాలోని కనిగిరి, కందుకూరు, గిద్దలూరు, బేస్తవారిపేట, దర్శి, చీమకుర్తి, మార్కాపురం వంటి ప్రాంతాల్లో దీని ప్రభావం అధికంగా ఉంటోంది. పైగా ఈ జిల్లాలో భూగర్భజలాలు అంతంత మాత్రమే. ఉన్న కొద్ది భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ప్రభావం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సమీపంలోని సింగరాయ కొండ సముద్ర తీర ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయాలనే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్లాంట్ అందుబాటులోకి వస్తే..
తన ఆలోచనను వైఎస్ ప్రభుత్వం ఆచరణలో పెడితే.. మంచినీటి ఎద్దడి దాదాపుగా ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు అధికారులు. సముద్ర జలాలను మంచినీటిగా మార్చి, దాన్ని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సరఫరా చేయడం వల్ల అద్భుత ఫలితాలు రావచ్చని అంటున్నారు. సింగరాయ కొండ నుంచి సముద్ర తీరం సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 10 కిలోమీటర్ల మేర పైప్ లైన్ వేసి, సముద్రపు నీటిని ప్లాంట్ తరలించి అక్కడ దాన్ని మంచినీటిగా మార్చి.. దాన్ని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సరఫరా చేయాలనేది ప్రాథమిక ఆలోచన. దీనిపై సాధ్యసాధ్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు పరిశ్రమల శాఖ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ లోని హెచ్2ఐడీ ప్లాంట్ అనుసరిస్తోన్న సాంకేతికత పరిజ్ఒానాన్ని అందిపుచ్చుకోవాలనేది ముఖ్యమంత్రి అభిప్రాయమని అంటున్నారు.