డ్యూటీలోనే ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు...ప్రయాణికుల్నికాపాడి...కన్నుమూశాడు
చిత్తూరు: ఆయనో ఆర్టీసీ డ్రైవర్..రోజూలాగానే డ్యూటీకి బయలుదేరి వెళ్లాడు...బస్సు నడుపుతూ ఉండగానే గుండె నొప్పి వచ్చింది. దీంతో తన ప్రాణాలు పోయినా ప్రయాణికులకు ఏమీ కాకూడదనుకున్నాడు...వెంటనే బస్సును రోడ్డు పక్కగా ఆపేసి కండక్టర్ కు విషయం చెప్పాడు...
ఆ బస్సులోని కండక్టర్ 108 కు ఫోన్ చేసి బస్సులో ప్రయాణికులను వేరే బస్సులో పంపాడు...అయితే 108 వచ్చేలోపు గుండె నొప్పి అధికమై డ్రైవర్ కన్నుమూశాడు...ఈ విషాదకర సంఘటన రేణిగుంటలో చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్యాసింజర్స్ ఉండగా తన వల్ల వారికి అపాయమే కాదు అసౌకర్యం కూడా ఉండకూడదని డ్రైవర్ తాపత్రయ పడిన తీరు ప్రయాణికుల హృదయాలను కలచివేసింది.
వివరాల్లోకి వెళితే...శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు ఆర్టీసీ డిపోలో పి.సుబ్రహ్మణ్యం రెడ్డి డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఆయన ఆదివారం రాపూరు నుంచి తిరుపతికి డ్యూటీ నిమిత్తం వెళ్లాడు. తిరుపతి నుంచి తిరిగి బస్టాండులో ప్రయాణికులను ఎక్కించుకుని రాపూరుకు బయలుదేరాడు. అయితే మార్గమధ్యంలో రేణిగుంట రింగ్రోడ్డు వద్దకు వచ్చేసరికి సుబ్రహ్మణ్యం రెడ్డికి గుండె నొప్పి వచ్చింది. వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపి, తనకు గుండె పోటు వచ్చిన విషయం చెప్పి ప్రయాణికులను వేరే బస్సులో పంపించాలని కండెక్టర్ కు చెప్పి ఆ ప్రకారం చెయ్యాల్సిందిగా ప్రయాణికులను కోరాడు.
దీంతో ప్రయాణికులంతా దిగి వేరే బస్సు ఎక్కి వెళ్లగా డ్రైవర్ బస్సు వెనుక సీటులో పడుకున్నాడు. అయితే కొద్దిసేపటి తర్వాత అనుమానం వచ్చిన కండక్టరు సుబ్రహ్మణ్యంను పరిశీలించగా స్పృహ లేదు. కండక్టర్ సమాచారం మేరకు 108 సిబ్బంది వచ్చేసరికే అప్పటికే డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి చెందినట్టు గుర్తించారు.