కడప తెలుగు తమ్ముళ్ల సిగపట్లు: ప్రకాశం డీసీసీబీ చైర్మన్, డైరెక్టర్ల రాజీనామా అస్త్రం
అధికార తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ పేరిట ఎన్ని కబుర్లు చెప్పినా.. జిల్లాల్లో మాత్రం తెలుగు తమ్ముళ్లు తమ రూటే సెపరేటని నినదిస్తున్నారు.
అమరావతి: అధికార తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ పేరిట ఎన్ని కబుర్లు చెప్పినా.. జిల్లాల్లో మాత్రం తెలుగు తమ్ముళ్లు తమ రూటే సెపరేటని నినదిస్తున్నారు. అధికార తెలుగుదేశం పార్టీలో అసమ్మతిరాగం వినిపిస్తోంది.. ఒకేమాట.. ఒకే బాటగా సాగలని ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాలను జిల్లాల్లోని నేతలు అంతర్గత లుకలుకలతో బేఖాతర్ చేస్తున్నారు.
ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి సొంత జిల్లా కడపలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ స్థానంలో పాగా వేయాలని టీడీపీ వ్యూహ రచనలు చేస్తోంది. కానీ ఆచరణలో కడప జిల్లాలోని ఇతర నియోజకవర్గాల పరిధిలో నాయకులంతా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక ప్రకాశం జిల్లాలో డీసీసీబీ చైర్మన్ ఈదర మోహన్, సహకారశాఖ కమిషనర్ మురళి మధ్య నువ్వా? నేనా? అన్నట్లు ఆధిపత్య పోరాటం సాగుతోంది. డీసీసీబీలో అవకతవకలపై కమిషనర్ ఆదేశాలు జారీ చేయడంతో చైర్మన్, డైరెక్టర్లు రాజీనామా అస్త్రాలు సంధించారు. వాటిని కూడా జిల్లా ఇన్ చార్జి మంత్రి ఆదినారాయణరెడ్డి పంపడం ఆసక్తికర రాజకీయంగా మారింది.
బాహాబాహీకి దిగిన ముఠా కుమ్ములాటలు
ఊరూరా పుట్టుకొచ్చిన గ్రూపు రాజకీయం, అధికారంలోనే ప్రతిపక్షంగా మారిన నేతలతో కొరవడిన సమన్వయంతో కడప జిల్లాలోని టీడీపీలో పరిస్థితి పట్టుతప్పుతోంది. క్రమేణా సమష్టిస్వరానికి అర్థం మారిపోతోంది. వాడీవేడి విమర్శలు, నిరసనలు బాహాటంగానే సాగడం చర్చకు దారితీస్తోంది. ఇటీవల రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కడప జిల్లాలో పర్యటించినప్పుడు ఈ అంశం చర్చకు వచ్చింది. పలు చోట్ల సమస్య స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీలో రెండు మూడు వర్గాలు ఏర్పాటయ్యాయి.
ప్రస్తుతం బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జయరాములు, విజయమ్మ వర్గాల మధ్య వివాదం క్రమేణా వేడెక్కుతోంది. సమన్వయ కమిటీ సమావేశంలోనే ఓ వర్గం విమర్శలకు దిగింది. ఇక్కడ ఆధిపత్య సమస్య ప్రధాన కారణంగా మారింది. మూడు నెలల క్రితమే ప్రభుత్వ పథకాల శంకుస్థాపనల సమయంలో ఇరువర్గాలు బాహాబాహీకి సిద్ధమవడం తెలిసిందే. దీనిపై అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పార్టీ అధిష్ఠానానికీ నిఘావర్గాలు సమాచారం చేరవేయగా.. ఉన్నతవర్గాల సూచన మేరకు మిన్నకుండిపోయారన్నది పార్టీ వర్గాలు తెలిపాయి. స్తబ్ధుగా ఉన్న సమస్య మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఓ వర్గం సమావేశం పెట్టి మరీ విమర్శలు చేయడం.. మరో వర్గం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడం హాట్టాపిక్గా మారింది.
ఆసుపత్రి కమిటీ చైర్మన్ పదవి కోసం పట్టు
కడపలో రాజకీయ సమీకరణాలు జిల్లావ్యాప్తంగానూ చర్చనీయాంశమయ్యాయి. ప్రొద్దుటూరు, జమ్మలమడుగులోనూ కొద్దిరోజులుగా ఉన్న పరిస్థితులు పార్టీలో అంతర్గత లుకలుకలకు అద్దం పడుతున్నాయి. ఇక్కడ కొన్ని ప్రభుత్వ పథకాల అమలులో సమస్య ఏర్పడింది. గృహనిర్మాణాలు తాము చెప్పిన చోటే జరుపాలని కొందరు.. కాదని మరికొందరు.. పట్టుబట్టడంతో ఎటూ తేలకుండా ఉండిపోయింది.
మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జమ్మలమడుగులో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ పదవి కోసం ఇద్దరు నేతలు పోటీపడటం.. తమకంటే తమకేనంటూ పంతం పూనడం సమస్యను జఠిలం చేస్తోంది. మంత్రి ఆదినారాయణ రెడ్డి తన కుమారుడికి, రామసుబ్బారెడ్డి తన అనుచరుడికి ఇప్పించేందుకు మంకుపట్టు పట్టారని తెలుస్తున్నది.
చైర్మన్ తదితరుల రాజీనామాలు తిరస్కరించిన మంత్రి
ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (పీడీసీసీబీ) కేంద్రంగా రాజకీయ దాగుడుమూతలు నడుస్తున్నాయి. సహకార శాఖ కమిషనర్ వేధిస్తున్నారని డీసీసీబీ చైర్మన్ ఈదర మోహన్ సహా పలువురు డైరెక్టర్లు రాజీనామా అస్త్రాలు సంధిస్తున్నారు. మోహన్ తన రాజీనామా లేఖను సహకార శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డికి పంపానని చెప్తున్నారు. నిజానికి ఛైర్మన్ రాజీనామా చేయాలంటే తన లేఖను సహకార శాఖ కమిషనర్కే పంపాలి. ఇదే విషయమై మోహన్ను వివరణ కోరగా, కమిషనర్తోనే సమస్య ఉంటే ఆయనకు ఎందుకు పంపిస్తానని ప్రశ్నించారు.
కమిషనర్ మురళి వేధింపులే తన రాజీనామాకు ప్రధాన కారణమంటూ ఛైర్మన్ మొత్తం ఎనిమిది అంశాలను లేవనెత్తారు. కానీ ఈ విషయాన్ని స్థానికంగానే తేల్చుకోవాలని, తన వరకూ రావద్దని మంత్రి ఆ లేఖను తిప్పి పంపినట్లు స్పష్టమవుతోంది. సహకార సంఘాల ద్వారా రుణాలు, ఎరువులు అందించే కీలక సమయంలో డీసీసీబీ పరిధిలో జరుగుతున్న పరిణామాలు రైతులను, జిల్లాలోని సహకార వ్యవస్థను అయోమయంలో పడేశాయి. ఇటు జిల్లా టీడీపీ నాయకులు కూడా ఎటూ చెప్పలేక, వేచి చూసే ధోరణిలో ఉన్నారు.
ఎమ్మెల్యేలతో మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇలా సంప్రదింపులు
ఛైర్మన్ రాజీనామా లేఖను తనకు చేరకముందే, తనకు అందుతుందని తెలుసుకున్న మంత్రి ఆదినారాయణరెడ్డి దీన్ని తిరస్కరించారు. ఏదైనా ఉంటే జిల్లా స్థాయిలోనే సర్దుబాటు చేసుకోవాలని, వ్యవహారం పెద్దదైతే శాఖాపరంగా చూద్దాం, అయినా రాజీనామా చేస్తే నాకు ఎందుకు? కమిషనర్కు పంపాలిగా? అని ఆయన అన్నట్లు తెలుస్తోంది. లేఖ వచ్చిన వెంటనే తిప్పి పంపాలని తన సిబ్బందికి ఆదేశించారు.
ఈ రాజీనామా లేఖ విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించిన ఇద్దరు ఎమ్మెల్యేలతోను ఇదే వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఆరోపణలుంటే మాత్రం చూద్దాం అని సూచించారు. ‘ప్రకాశం డీసీసీ బ్యాంకు ఛైర్మన్ ఈదర మోహన్ రాజీనామా లేఖ నాకు పంపించారని తెలిసింది. నేను ఇతర పనుల్లో ఉన్న కారణంగా చూడలేదు. నాతో ఇద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడినా నేను జిల్లాస్థాయిలో సర్దుబాటు చేసుకోవాలని చెప్పాను. అసలు ఎవరిపై ఫిర్యాదు చేశారో, అందులో విషయం ఏముందో, ఎందుకు రాజీనామా చేశారో కూడా చూడలేదు. ఇవన్నీ చిన్న విషయాలు, జిల్లా స్థాయిలోనే మాట్లాడుకుంటే మంచిది' అని వారికి సూచించాను.' అని మంత్రి ఆదినారాయణ రెడ్డి వివరించారు.
అవకతవకలపై సహకార శాఖ కమిషనర్ ఇలా విచారణకు ఆదేశం
కొంతకాలంగా కమిషనర్కు, డీసీసీబీ ఛైర్మన్ మధ్య ముసలం నడుస్తోందనేది తెలుస్తూనే ఉంది. డీసీసీబీ పరిధిలో ఉద్యోగ నియామకాలు, డీసీఎంఎస్కు సినిమా వ్యాపారం కోసం రుణం ఇవ్వడం, రుణాల పంపిణీలో లోపాలు, ఇతర ఆరోపణలపై కొంతకాలంగా సహకార శాఖ కమిషనర్కు పలు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులు స్థాయి లేని వాళ్లు, సంబంధం లేని వాళ్లు ఇచ్చారు కాబట్టి విచారణ అవసరం లేదని చట్టం చెబుతోందని చైర్మన్ వాదన. వీటిపై విచారణ చేయించేందుకు, సహకార వ్యవస్థలో బలీయమైన సెక్షన్-51 విచారణకు పత్రాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందగానే ఇలా చైర్మన్, డైరెక్టర్లు రాజీనామాలకు సిద్ధపడ్డారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
దీన్ని రాజకీయంగా ఎదుర్కొనేందుకే మంత్రికి లేఖ రాశారని వాదనలు వినిపిస్తున్నాయి. డీసీసీబీలో పలు లావాదేవీలపై ఫిర్యాదులు, ఆర్థిక వ్యవహారాలపై ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైనే విచారణ చేపట్టి నివేదిక అందించాలని కమిషనర్ ఆదేశించారు. ఇటీవల పలు సొసైటీలపై విచారణ జరిగింది. సహకార శాఖ కమిషనర్ వేధింపుల కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చిందని డీసీసీబీ చైర్మన్ ఈదర మోహన్ వ్యాఖ్యానించారు. దీని వల్ల రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగవన్నారు. చిన్న చిన్న ఆరోపణలు, ఫిర్యాదులు పట్టుకుని వ్యవస్థను నాశనం చేసేలా కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆ అధికారి వ్యవహార శైలికి నిరసనగానే రాజీనామాలు చేశాం. అందుకే రాజీనామా లేఖను మంత్రికి పంపించానని, ఆయనే నిర్ణయం తీసుకుంటారని స్పష్టంచేశారు.