తిరుమల శ్రీవారి ఆభరణాల వివరాలు ఆన్లైన్లో పెట్టాలి: రోజా
తిరుమల: తిరుమల శ్రీవారి ఆభరణాలపై భక్తుల్లో ఇంకా అనుమానాలు అలాగే ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పారు. శ్రీవారి ఆభరణాలు, ఆస్తుల వివరాలను ఆన్లైన్లో పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
బుధవారం ఉదయం తిరుమల ఏడుకొండల స్వామిని వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, కోన రఘుపతి, ఆదిమూలపు సురేష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ నిత్యం స్వామివారికి సేవ చేసే ప్రధాన అర్చకులు రమణదీక్షితులను అవమానపరిచి తొలగించారని టీటిడిపై మండిపడ్డారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పదవీ విరమణ చేసిన అర్చకులకు పూర్వవైభవం తీసుకువస్తామని రోజా హామీ ఇచ్చారు. చంద్రబాబు నిరంకుశత్వానికి ఇది నిదర్శనమన్నారు. మహా సంప్రోక్షణ సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించకపోతే నిరసన తెలియజేశామని...దీంతో ప్రభుత్వం దిగి వచ్చిందని తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన వారిని వెంటనే టీటీడీ నుంచి తొలగించాలని రోజా డిమాండ్ చేశారు.
శ్రీవారి ఆభరణాల వివరాలు ఆన్లైన్లో ఉంచాలని, గతంలో ఆన్లైన్లో ఉంచుతామని చెప్పిన జేఈఓ శ్రీనివాస రాజు ఇప్పటివరకు వాటిని పెట్టలేదని వివరించారు. తిరుమల శ్రీవారి ఆభరణాలు మాయం అయ్యాయని భక్తుల్లో అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. వాటిని నివృత్తి చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.