తిరుమలలో మాజీ ప్రధాని దేవెగౌడకు చేదు అనుభవం
తిరుపతి: తన జన్మదినాన్ని వేంకటేశ్వరుని సన్నిధిలో జరుపుకోవాలని కర్ణాటక నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మాజీ ప్రధాని దేవేగౌడ, అయన కుటుంబ సభ్యులకు గురువారం సాయంత్రం చేదు అనుభవం ఎదురైంది.
మాజీ ప్రధానికి కల్పించాల్సిన ప్రొటోకాల్ స్వాగతం, వాహన సౌకర్యాలు చేపట్టాల్సిన రెవెన్యూ, పోలీస్ విభాగం అసలు పట్టించుకోలేదు. దీంతో ఆయన రేణిగుంట విమానాశ్రయంలో తిరుమలకు వెళ్లేందుకు వాహనాలు లేక గంటపాటు వేచి వచ్చింది. గంట తర్వాత తనంత తానుగా తిరుమలకు చేరుకున్నారు.
ఇదేమిటని రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటం ఒక ఇబ్బందైతే ఆయన రాక సమాచారం తమకు ఆలస్యంగా అందిందని రెవెన్యూ అధికారులు అంటున్నారు. వాహనాలు కల్పించాల్సింది తాము కాదని, పోలీసులంటూ చేతులు దులుపుకున్నారు. సర్వసాధారణంగా దేవేగౌడ తన జన్మదినం రోజున తిరుమలకు వచ్చి వెంకన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా పాటిస్తున్నారు.
ఇందులో భాగంగానే శుక్రవారం ఆయన జన్మదినం కావడంతో గురువారం సాయంత్రం 5.30 గంటలకుప్రత్యేక విమానంలో ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఒక మాజీ ప్రధాని రేణిగుంట విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఒక పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు కూడా ఒక్క అధికారి కూడా అక్కడలేక పోవడం విస్మయ పరచింది.
రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు వెళ్లడానికి మాజీ ప్రధాని వచ్చినప్పుడు వాహనాలు ఏర్పాటు చేస్తారు. అయితే ఆ వాహనాలు రాకపోవడంతో ఆయన విమానాశ్రయ విఐపి లాంజ్లోనే నిరీక్షించాల్సి వచ్చింది. వాహనాలు రాకపోవడంతో బెంగళూరు నుంచి తన వెనుకగా రోడ్డు మార్గన వచ్చిన కార్లను విమానాశ్రయానికి రప్పించుకుని తిరుమలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే కర్ణాటక నుంచి ఆయనకు భద్రతగా అక్కడి రాష్ట్ర పోలీసులు ఒక కారులో వచ్చారు. ఈపరిస్థితి గమనించిన రేణిగుంట పోలీసులు ఒక కారును ఏర్పాటు చేసుకుని కొంత మంది పోలీసుల బృందంతో ఆయన వెంట తిరుమలకు వెళ్లారు.