అభివృద్ధి వికేంద్రీకరణ ఓకే ... మూడు రాజధానులు వద్దన్న ఏపీ క్రెడాయ్
ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం సీఎం జగన్ వ్యక్తం చెయ్యటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ అలా నిర్ణయం తీసుకుంటే రాష్ట్రాభివృద్ధి కుంటు పడుతుంది అని కొందరు అంటున్నారు. మరికొందరు జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. మొత్తానికి మూడు రాజధానుల అంశం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
ఏపీకి మూడైతే యూపీకి 12 కావాలి ..తుగ్లక్ ముత్తాత నిర్ణయంలా జగన్ నిర్ణయమన్న కేశినేని నానీ
మూడు రాజధానుల ఏర్పాటు ఆచరణ సాధ్యం కాదన్న క్రెడాయ్
ఏపీ అసెంబ్లీ సమావేశాలలో రాజధాని పై జరిగిన చర్చ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధాని పై క్లారిటీ ఇచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, దాని కోసం మూడు రాజధానులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచనప్రాయంగా ప్రకటించారు. నిపుణుల కమిటీ నివేదిక తర్వాత తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అయితే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే పాలనా పరమైన ఇబ్బందులు వస్తాయని, మూడు రాజధానుల ఏర్పాటు ఆచరణ సాధ్యం కాదని ఏపీ క్రెడాయ్ ప్రతినిధులు పేర్కొన్నారు.
అభివృద్ధి వికేంద్రీకరణ స్వాగతిస్తాం .. రాజధాని వికేంద్రీకరణ కాదన్న క్రెడాయ్
అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒప్పుకున్నా ఏపీ క్రెడాయ్ ప్రతినిధులు , దాని కోసం మూడు రాజధానులు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రాజధాని వికేంద్రీకరణ ప్రకటన వల్ల ప్రజల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వైజాగ్ వాసులు రాయలసీమకు వెళ్లాలన్నా , రాయలసీమ నుంచి పనుల కోసం వైజాగ్ వెళ్లాలన్న సాధ్యమయ్యే పనికాదని, లోటు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రంలో ఇటువంటి ప్రయోగాలు మంచిది కాదని క్రెడాయ్ ప్రతినిధులు వ్యాఖ్యానించారు.
రాజధానిపై కమిటీ నివేదిక రాక ముందే ప్రకటనపై అనుమానం వ్యక్తం చేసిన ప్రతినిధులు
అంతేకాదు సీఎం జగన్ ప్రకటన వల్ల మూడు ప్రాంతాల్లో ఆందోళనలు, అల్లర్లు చెలరేగే ప్రమాదం, ప్రాంతాల మధ్య ఘర్షణలకు ఆస్కారం ఉందని క్రెడాయ్ ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఆలోచన మంచిదే అయినప్పటికీ రాజధాని వికేంద్రీకరణ మాత్రం మంచిది కాదని వారు పేర్కొన్నారు. రాజధానిపై కమిటీ నివేదిక రాకుండా ముందుగానే ప్రకటన చేయటం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు.
రాజధానిగా అమరావతినే ఉంచమని విజ్ఞప్తి
ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల రాజధానిగా అమరావతినే ఉంచాలని వారు సీఎం జగన్ కు సూచించారు. ఇక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా, అభివృద్ధి వికేంద్రీకరణకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఇప్పటికే సగం నిర్మాణాలు పూర్తి చేసుకున్న అమరావతినే రాజధానిగా ప్రకటించి వనరులు వసతులు కల్పించాలని క్రెడాయ్ ప్రతినిధులు సీఎం జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మరి సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధానిపై ప్రస్తుతం వ్యక్తమవుతున్న విభిన్న అభిప్రాయాల నేపథ్యంలో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి .