నేపాల్లో చిక్కుకున్న దేవేందర్ గౌడ్ తనయుడు: కేంద్ర మంత్రులకు వినతి
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ తెలంగాణ సీనియర్ నేత దేవేందర్గౌడ్ బుధవారం పలువురు కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. నేపాల్లో చిక్కుబడిపోయిన తన కుమారుడు వీరేందర్గౌడ్ సహా 16 మంది బృందాన్ని తక్షణం రక్షించాలని విజ్ఞప్తి చేశారు.
భూకంపంతో అల్లకల్లోలంగా మారిన నేపాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీరేందర్ బృందం ఇటీవల అక్కడకు వెళ్లింది.వారు ఆ పనుల్లో ఉండగానే మంగళవారం మరోసారి భారీ భూకంపం విరుచుకుపడింది.
ఈ సమయంలో వారు సింధుపాల్చౌక్ జిల్లా స్యాయూల్ బజార్ గ్రామంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో వీరేందర్ బృందాన్ని ఆర్మీ హెలీకాప్టర్ల సహాయంతో రక్షించాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను దేవేందర్ గౌడ్ కోరారు.
వారు సురక్షితంగా స్వదేశానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాల్సిందిగా పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుకు విజ్ఞప్తి చేశారు.