నాడు దేవీపట్నం లాంచీ ప్రమాదంపై జగన్ వ్యాఖ్యలు వైరల్ .. నేటి దుర్ఘటనతో జగన్ పై నెటిజన్లు ఫైర్
గోదావరిలో నిన్న ఘోర దుర్ఘటన తెలుగు రాష్ట్రాలను విషాదంలో ముంచేసింది. గోదావరి నదిలో కచ్చులూరు వద్ద రాయల్ పున్నమి బోట్ మునిగిపోవడంతో 12 మంది మృతి చెందగా, మరో 25 మందికి పైగా గల్లంతైన పరిస్థితి. ఇక గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే కాకుండా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రాజకీయ పార్టీలైన జనసేన, టిడిపి శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
తెరమీదకు దేవీపట్నం ప్రమాద ఘటన .. సోషల్ మీడియాలో నాటి జగన్ ట్వీట్ వైరల్
ఇదిలా ఉంటే ఈ ఘటన నేపథ్యంలో గతంలో దేవీపట్నం లో జరిగిన లాంచీ ప్రమాద ఘటన తెరపైకి వచ్చింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ గతంలో దేవీపట్నం లాంచీ ప్రమాదం పై చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు మరోసారి వైరల్ అయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి వల్లే ఘోరాలు జరుగుతున్నాయంటూ, దేవీపట్నం లాంచీ ప్రమాదంపై జగన్ ట్వీట్ చేశారు. దేవీపట్నం లాంచీ ప్రమాదం గురించి నాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ ను గమనిస్తే
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం ,అవినీతి వంటి కారణాలతోనే దేవీపట్నం ఘటన అన్న నాటి జగన్ ట్వీట్
"దేవీపట్నం లాంచీ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు బాధాతప్త హృదయంతో నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను .గత ఆరు నెలల్లో అనుమతిలేని పడవలు, లైసెన్సు లేని డ్రైవర్ల వల్ల ఇలాంటి దుర్ఘటనలు మూడు జరిగాయి. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం ,అవినీతి, ఇలాంటివి మామూలే అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించడం వంటి కారణాల వల్ల ఇలాంటి దుర్ఘటనలు దారితీయడం అత్యంత బాధాకరం" అని జగన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కచ్చులూరు వద్ద లాంచీ మునక ఘటన నేపథ్యంలో నాటి జగన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .
జగన్ సీఎంగా ఈ దుర్ఘటనపై ఏం చెప్తారని నెటిజన్ల ప్రశ్నలు
సీఎం హోదాలో ఉన్న జగన్, ఇప్పుడు తాజా ఘటన పై ఏమంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నాడు ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పిన ఆయన, ఇప్పుడు కూడా అదే విషయాన్ని అంగీకరిస్తారా? అంటూ నెటిజన్లు జగన్ ను ప్రశ్నిస్తున్నారు. ఆదివారం నాడు ప్రమాదం జరిగిన లాంచీ ప్రయాణానికి అనుమతి లేదని స్వయంగా హోమ్ మంత్రి మేకతోటి సుచరిత ప్రకటించడంతో, అసలు ఈ బోటు అనుమతి లేకుండా ఎలా బయలుదేరిందని జగన్ సర్కార్ ను నిలదీస్తున్నారు .
దేవీపట్నం ఘటనలో బాబు సర్కార్ ఫెయిల్ .. ఇప్పుడు జగన్ సర్కార్ కూడా ఫెయిల్ అయిందా ?
అధికారులు లంచాలు తీసుకుంటున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నాడు చంద్రబాబు హయాంలో ఇలాంటి ఘటనలను నియంత్రించ లేకపోయారు.మరి నేడు జగన్ హయాంలో ఇలాంటి దుర్ఘటనలు ఎందుకు చోటుచేసుకుంటున్నాయని నెటిజన్లు జగన్ ను సూటిగానే ప్రశ్నిస్తున్నారు. అప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తూ దీనిపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే పెట్టారు. దేవీపట్నం ఘటనలో బాబు సర్కార్ ఫెయిల్ .. ఇప్పుడు జగన్ సర్కార్ కూడా ఫెయిల్ అయిందా అని ఫైర్ అవుతున్నారు.